ఇంగ్లిష్ బౌలర్ల స్వింగ్కు టాపార్డర్ విఫలమైన చోట.. కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధశతకంతో ఆకట్టుకుంటే.. 127/7తో పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును శార్దూల్ ఠాకూర్ తన మెరుపులతో ఆదుకున్నాడు. నిఖార్సైన బ్యాట్స్మన్ను తలపిస్తూ టీ20 తరహాలో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఫలితంగా భారత జట్టు ఓ మోస్తారు స్కోరు చేయగా.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. బుమ్రా బుల్లెట్లు సంధిస్తే.. ఉమేశ్ తన అనుభవాన్నంతా రంగరించి రూట్ను పెవిలియన్ చేర్చాడు.
లండన్: పేస్కు సహకరిస్తున్న పిచ్పై ఇరు జట్ల బౌలర్లు విజృంభించడంతో.. భారత్, ఇంగ్లండ్ మధ్య గురువారం ప్రారంభమైన నాలుగో టెస్టు తొలిరోజే ఆసక్తికరంగా మారింది. క్రిస్ వోక్స్, రాబిన్సన్ ధాటికి ఒక దశలో కుప్పకూలేలా కనిపించిన టీమ్ఇండియాకు శార్దూల్ ఠాకూర్ ఊపిరిలూదితే.. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ను మనవాళ్లు దెబ్బకొట్టారు. మొత్తానికి తొలి రోజు నుంచే మలుపులు తిరుగుతున్న పోరులో.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియా.. తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకు ఆలౌటైంది. శార్దూల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (96 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధశతకాలు సాధించగా.. మిగిలినవాళ్లు విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో వోక్స్ 4, రాబిన్సన్ మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ గురువారం ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. జస్ప్రీత్ బుమ్రా (2/15), ఉమేశ్ యాదవ్ (1/15) విజృంభించారు. ప్రస్తుతం చేతిలో 7 వికెట్లు ఉన్నా ఇంగ్లండ్.. కోహ్లీ సేన తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 138 పరుగులు వెనుకబడి ఉంది. డేవిడ్ మలన్ (26), ఓవర్టన్ (1) క్రీజులో ఉన్నారు.
టాప్ టపా..టపా.
గత మ్యాచ్ అనుభవాల దృష్ట్యా.. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్.. టీమ్ఇండియాను బ్యాటింగ్కు ఆహ్వానించగా.. మనవాళ్లు పేలవ ఫామ్ కొనసాగించారు. స్వింగ్ అవుతున్న బంతిని ఎదుర్కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడిన రోహిత్ శర్మ (11) కొన్ని ఉత్కంఠ క్షణాలను ఎదుర్కొన్న అనంతరం వోక్స్ బౌలింగ్లో కీపర్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అదే స్కోరు వద్ద మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (17) కూడా పెవిలియన్ చేరగా.. గత మ్యాచ్లో చక్కటి పోరాటం కనబర్చిన చతేశ్వర్ పుజారా (4) వారిని అనుసరించాడు. అండర్సన్ వేసిన బంతికి పుజారా వద్ద సమాధానమే లేకపోయింది. ఫలితంగా 39 పరుగులకే భారత జట్టు మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ బౌలర్లు విజృంభిస్తున్న సమయంలో కోహ్లీ, జడేజా (10) సంయమనంతో ఆడి మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను 54/3తో ముగించారు. లంచ్ అనంతరం కోహ్లీ పూర్తి సాధికారికతతో ఆడగా.. జడేజా.. వోక్స్ బౌలింగ్లో ఔటయ్యాడు. 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రూట్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన కోహ్లీ.. ఆ తర్వాత చక్కటి షాట్లతో ముందుకు సాగాడు. మరో ఎండ్లో వైస్ కెప్టెన్ అజింక్యా రహానే (14) క్రీజులో కుదురుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడుతుంటే.. హాఫ్సెంచరీ అనంతరం కోహ్లీ కీపర్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పటికే రివ్యూ సాయంతో ఓ సారి బతికిపోయిన రహానే.. గంటన్నర సేపు క్రీజులో గడిపాక ఓవర్టన్ బౌలింగ్లో వెనుదిరిగాడు.. ఆదుకుంటాడనుకున్న రిషబ్ పంత్ (9) అలా వచ్చి ఇలా వెళ్లడంతో.. టీమ్ఇండియా 127/7తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.
శార్దూల్ ధమాకా..
పోరాడితే పోయేదేముంది అన్నట్లు.. టాపార్డర్ విఫలమైన చోట శార్దూల్ ఠాకూర్ ఇంగ్లిష్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా బౌండ్రీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. వోక్స్కు రెండు ఫోర్లతో స్వాగతం పలికిన శార్దూల్.. ఓవర్టన్కు సిక్సర్ రుచి చూపించాడు. భారత్ ఇన్నింగ్స్లో ఇదే తొలి సిక్సర్ కావడం గమనార్హం. భారత టాపార్డర్ను తీవ్రంగా ఇబ్బంది పెట్టిన వోక్స్కు మరో రెండు ఫోర్లు బాదిన శార్దూల్.. ఓవర్టన్ తల మీదుగా కొట్టిన బౌండ్రీ చూసి తీరాల్సిందే. ఆ తర్వాత వోక్స్ ఓవర్లో 6,4, రాబిన్సన్ ఓవర్లో 4,6తో విజృంభించిన శార్దూల్ 31 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. టెస్టు క్రికెట్లో భారత్ తరఫున ఇది రెండో వేగవంతమైన అర్ధశతకం కావడం విశేషం. ఫిఫ్టీ అనంతరం శార్దూల్ ఔట్ కాగా.. బుమ్రా (0), ఉమేశ్ యాదవ్ (10) వికెట్లు పడటానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఈ మ్యాచ్లో ఇరు జట్లు రెండేసి మార్పులతో బరిలోకి దిగాయి. జోస్ బట్లర్, సామ్ కరన్ స్థానాల్లో ఇంగ్లండ్ ఓలీ పోప్, క్రిస్ వోక్స్ను జట్టులోకి తీసుకోగా.. స్వల్ప గాయాలతో ఇబ్బంది పడుతున్న మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మకు విశ్రాంతినిచ్చిన టీమ్ఇండియా.. వారి ప్లేస్లో శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ను జట్టులో చోటు కల్పించింది. వరుసగా నాలుగో టెస్టులోనూ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కు తుదిజట్టులో చోటు దక్కలేదు.
బుమ్రా బుల్లెట్..
ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేశాం అనే ఆనందం ఇంగ్లండ్కు ఎక్కువసేపు నిలువలేదు. నాలుగో ఓవర్ రెండో బంతికి రోరీ బర్న్స్ (5)ను ఔట్ చేసిన బుమ్రా.. అదే ఓవర్ చివరి బంతికి హసీబ్ హమీద్ (0)ను కూడా బుట్టలో వేసుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ 6 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్ మలన్తో కలిసి కెప్టెన్ జో రూట్ (21) వేగంగా పరుగులు రాబట్టాడు. ఈ జోడీ వీలుచిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదడంతో చూస్తుండగానే ఇంగ్లండ్ స్కోరు 50 దాటింది. ఈ దశలో ఉమేశ్ యాదవ్ ఓ చక్కటి బంతితో రూట్ను పెవలియన్కు చేర్చా డు. ఈ దశలో నైట్ వాచ్మెన్ ఓవర్టన్తో కలిసి మలన్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు.
కోహ్లీ @ 23,000
రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ద్వారా మరో రికార్డును తన పేరిట రాసుకున్నాడు. ఇంగ్లండ్తో నాలుగో టెస్టులో అర్ధశతకం సాధించిన టీమ్ఇండియా కెప్టెన్.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 23 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ ఫీట్ సాధించేందుకు కోహ్లీకి 490 ఇన్నింగ్స్లు అవసరం కాగా.. సచిన్ టెండూల్కర్ 522 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 544 ఇన్నింగ్స్ల్లో ఈ మార్క్ దాటాడు.
1 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా (490 ఇన్నింగ్స్ల్లో) 23 వేల పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (522 ఇన్నింగ్స్ల్లో) రెండో స్థానంలో ఉన్నాడు.
2 టెస్టు క్రికెట్లో భారత్ తరఫున వేగవంతమైన (31 బంతుల్లో) అర్ధశతకం చేసిన రెండో ఆటగాడిగా శార్దూల్ ఠాకూర్ చరిత్రకెక్కాడు. కపిల్దేవ్ (పాకిస్థాన్పై 30 బంతుల్లో) టాప్లో ఉన్నాడు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: రోహిత్ (సి) బెయిర్స్టో (బి) వోక్స్ 11, రాహుల్ (ఎల్బీ) రాబిన్సన్ 17, పుజారా (సి) బెయిర్స్టో (బి) అండర్సన్ 4, కోహ్లీ (సి) బెయిర్స్టో (బి) రాబిన్సన్ 50, జడేజా (సి) రూట్ (బి) వోక్స్ 10, రహానే (సి) అలీ (బి) ఓవర్టన్ 14, పంత్ (సి) అలీ (బి) వోక్స్, శార్దూల్ (ఎల్బీ) వోక్స్ 57, ఉమేశ్ (సి) బెయిర్స్టో (బి) రాబిన్సన్ 10, బుమ్రా (రనౌట్/బర్న్స్) 0, సిరాజ్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 8, మొత్తం: 191. వికెట్ల పతనం: 1-28, 2-28, 3-39, 4-69, 5-105, 6-117, 7-127, 8-190, 9-190, 10-191, బౌలింగ్: అండర్సన్ 14-3-41-1, రాబిన్సన్ 17.3-9-38-3, వోక్స్ 15-6-55-4, ఓవర్టన్ 15-2-49-1.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) బుమ్రా 5, హమీద్ (సి) పంత్ (బి) బుమ్రా 0, మలన్ (నాటౌట్) 26, రూట్ (బి) ఉమేశ్ 21, ఓవర్టన్ (నాటౌట్) 1, మొత్తం: 53/3. వికెట్ల పతనం: 1-5, 2-6, 3-52, బౌలింగ్: ఉమేశ్ 6-1-15-1, బుమ్రా 6-2-15-2, శార్దూల్ 3-1-11-0, సిరాజ్ 2-0-12-0.