2016లో మాడ్గులపల్లి మండలం ఏర్పాటు
మూడు నియోజకవర్గాల కూడలి
జిల్లాలోనే రెండో అతిపెద్ద మండలం
మాడ్గులపల్లి, ఏప్రిల్ 3: నల్లగొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ మూడు నియోజకవర్గాల పరిధిలో నాలుగు మండలాల గ్రామాలను కలిపి 2016 సంవత్సరంలో మాడ్గులపల్లిని మండలంగా ఏర్పాటు చేశారు. జిల్లాలోనే రెండో అతి పెద్ద మండలంగా ఆవిర్భవించింది. నాటి నుంచి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. తిప్పర్తి, వేములపల్లి, త్రిపురారం, నిడమనూరు మండలాల్లోని 20 గ్రామ పంచాయతీలు(21 రెవెన్యూ గ్రామాలు) సుమారు 36 వేల జనాభాతో మాడ్గులపల్లి మండలంగా ఆవిర్భవించింది. పాలనా సౌలభ్యంకోసం 2019 సంవత్సరంలో 400 జనాభా కలిగిన గ్రామాలను గ్రామ పంచాయతీలుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో మాడ్గులపల్లి మండలం 28 గ్రామ పంచాయతీలుగా ఏర్పడి పాలనలో ముందడుగేసింది. ప్రతి గ్రామంలోనూ పల్లెప్రగతి పనులు, సీసీరోడ్లు, వివిధ అభివృద్ధి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మండల అధికారులు అందుబాటులో ఉండి సమర్ధవంతంగా సేవలందిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మారిన గ్రామాల రూపురేఖలు
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో ప్రతి నెలా గ్రామ పంచాయతీ నిధులతో డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చడం, హరితహారంలో భాగంగా మొక్కల సంరక్షణ చేపట్టడంతో గ్రామాల రూపురేఖలు మారాయి. మం డలం ఏర్పడిన తరువాత నుంచి రూ.6 కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, 28 గ్రామ పంచాయతీల్లో రూ.3.50 కోట్లతో వైకుంఠధామాలు, రూ.42లక్షలతో డంపి ంగ్ యార్డు పనులు, రూ.66 లక్షలతో మూడు రైతు వేదికలను నిర్మించారు. మాడ్గులపల్లిలో రూ.25 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి.పాములపహాడ్ నుంచి లక్ష్మీదేవిగూడెం(వేములపల్లి మండలం, తక్కెళ్లపహాడ్(మిర్యాలగూడ మండలం) కల్వలపాలెం అడ్డరోడ్డు నుంచి బొమ్మకల్లుకు రూ.17 కోట్ల తో డబుల్ బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టారు.
28 గ్రామపంచాయతీల పరిధిలో మిషన్ భగీరథ పథకంలో రూ. 20.44 కోట్లతో 53 ఓవర్ హెడ్ ట్యాంకులు, పైప్ లైన్లు ఏర్పాటు చేశారు.