ముంబై: యంగ్ బ్యాట్స్మన్ షారుక్ ఖాన్ ఆదుకోవడంతో చెన్నైతో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పరువు నిలుపుకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లకు 106 పరుగులు చేసింది. ఒక దశలో 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన పంజాబ్ను షారుక్ ఆదుకున్నాడు. ఐపీఎల్ అనుభవం పెద్దగా లేకపోయినా ఎంతో పరిణతితో అతడు ఆడాడు. కెప్టెన్ రాహుల్ (5) సహా మయాంక్ అగర్వాల్ (0), గేల్ (10), పూరన్ (0)లాంటి స్టార్లు వెంట వెంటనే వెనుదిరిగినా.. షారుక్ మాత్రం 36 బంతుల్లో 47 పరుగులు చేసి పంజాబ్ స్కోరును 100 దాటించాడు. అతని ఇన్నింగ్స్లో 4 ఫోర్లు, 2 సిక్స్లు ఉన్నాయి. అతనికి దీపక్ హుడా (10), జై రిచర్డ్సన్ (15) కాస్త సహకరించారు.
అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ దీపక్ చహర్ చెలరేగి బౌలింగ్ చేశాడు. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయడం విశేషం. దీంతో పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు ఆశలు నెరవేరలేదు. అతని ధాటికి టాప్, మిడిలార్డర్ కుప్పకూలాయి. ఇక ఫీల్డింగ్లో జడేజా అద్భుతంగా రాణించాడు. రాహుల్ రనౌట్, గేల్ క్యాచ్ను పట్టిన తీరు మ్యాచ్కే హైలైట్. ఒక రకంగా రాహుల్ను అతడు రనౌట్ చేయడంతోనే మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పొచ్చు. రాహుల్ వికెట్ తర్వాత ఇక పంజాబ్ కోలుకోలేకపోయింది.