వాడవాడలా సీసీ రోడ్లు.. ఇంటింటా మరుగుదొడ్లు..
పరుచుకున్న పచ్చదనం.. ప్రకృతివనంతో ఆహ్లాదం..
ఆఖరి మజిలీ సమస్యలు తీర్చిన వైకుంఠధామం..
డంప్యార్డు, రైతు వేదికలు సర్వం సిద్ధం
విద్యుత్ వ్యవస్థ పటిష్టం.. ఎల్ఈడీ లైట్లతో శోభాయమానం..
మంచిర్యాల, మార్చి 19 (నమస్తే తెలంగాణ ): పల్లె ప్రగతి ఆ గ్రామ ముఖచిత్రాన్నే మార్చేసింది. ఆకట్టుకునేలా ఆహ్లాదంగా తీర్చిదిద్దిన పల్లె ప్రకృతి వనం, చెత్తకోసం ఏర్పాటు చేసిన డంప్యార్డు, అంతిమ వీడ్కోలు కోసం మౌలిక వసతులతో నిర్మించిన వైకుంఠధామం, అద్దంలా మెరిసే సీసీ రోడ్లు, మిరుమిట్లు గొలిపే ఎల్ఈడీ లైట్లు, హరితహారం కోసం నర్సరీలో పెరుగుతున్న మొక్కలు, ఎటు చూసినా పరిశుభ్రతతో పాటు సకల సౌకర్యాలతో ముందున్నది. ప్రణాళికాబద్ధంగా నిధుల ఖర్చు, అధికారులు, పాలకుల నిరంతర పర్యవేక్షణ, పారిశుధ్య కార్మికుల జవాబుదారీ తనం, ప్రభుత్వ ప్రోత్సాహం, విప్ బాల్క సుమన్ సహకారంతో నియోజకవర్గ కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న కిష్టంపేట అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నది.
మంచిర్యాల జిల్లాలోని కిష్టంపేట అభివృద్ధి బాటలో పయనిస్తున్నది. సర్వహంగులూ సమ కూర్చుకొని మిగతా పంచాయతీలకు ఆదర్శంగా నిలుస్తున్నది. నియోజకవర్గ కేంద్రానికి కూతవే టు దూరంలో ఉన్న కిష్టంపేట పంచాయతీ పాలకవర్గం, అధికార యంత్రాంగం పక్కా ప్రణాళిక, సమన్వయంతో ముందుకు సాగుతున్నది. కిష్టంపేట 1994లో గ్రామ పంచాయతీగా ఏర్పడింది. గ్రామంలో 3,516 జనాభా ఉండగా, అందులో 1,750 మంది స్త్రీలు, 1,766 మంది పురుషులున్నారు. గ్రామంలో 933 నివాస గృహాలుండగా, 1,206 కుటుంబాలు జీవనం కొనసాగిస్తు న్నాయి. చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా ఉన్న పల్లె నేడు అందంగా ముస్తాబైంది. పల్లె ప్రగతితో తన రూపురేఖలు మార్చుకొని మిగతా పంచాయతీలకు స్ఫూర్తిగా నిలుస్తున్నది.
తొలగిన ఆఖరి మజిలీ అవస్థలు..
గతంలో గ్రామంలో ఎవరైనా చనిపోతే కొందరిని సంబంధిత పొలాల్లో పూడ్చివేసేవారు. లేదంటే ఊరి బయటకు, సమీపంలోని వాగుకు తీసుకెళ్లి దహనం చేసేవారు. వాగులో నీళ్లు ఎండిపోతే స్నానాలకు, బట్టలు మార్చుకునేందుకు ఇబ్బందయ్యేది. వర్షం వస్తే దహన సంస్కార కార్యక్రమాలకూ తిప్పలయ్యేది. పల్లె ప్రగతిలో భాగంగా ఆఖరి మజిలీ సమస్య తీరిపోయింది. ఉపాధిహామీ కింద రూ.12 లక్షలతో సుద్దాల వాగు ఒడ్డున వైకుంఠధామం నిర్మించారు. స్వర్గలోకం పేరుతో శ్మశాన వాటికను నిర్మించి, అందమైన రంగులతో ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. ఇందులో మరుగుదొడ్లు, స్నానాలు, బట్టలు మార్చుకునేందుకు మహిళలకు, పురుషులకు వేర్వేరుగా ప్రత్యేక గదులను ఏర్పాట్లు చేశారు. రెండు బర్నింగ్ పాయింట్లు, రెండు దింపుడు కల్లాలు నిర్మించారు. శ్మశాన వాటిక చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.
పరుచుకున్న పచ్చదనం..
గ్రామంలోని వీధుల్లో రోడ్లకు ఇరువైపులా, ప్రధాన రహదారికి పక్కన ఉన్న చెట్లతో పచ్చదనానికి కేరాఫ్గా మారింది. మంచిర్యాల- చెన్నూర్ హైవేపై, స్థానిక డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం దారివెంట పోయేవారిని ఆకట్టుకుంటున్నది. దీనిని దాదాపు రూ.2.20 లక్షలతో ఎన్ఆర్ఈజీఎస్ సహాయంతో నిర్మించారు. పట్టణాల్లోని పార్కులను తలపించేలా తీర్చిదిద్దారు. గోడలపై గీసిన బొమ్మలు చూపరులను కట్టిపడేస్తున్నాయి. గ్రామంలో మొత్తం 11,440 మొక్కలు నాటారు. వాటిలో 11,000 బతికి ఉన్నాయి (96 శాతం). పల్లె ప్రకృతి వనంలో నీడనిచ్చే, ఔషధ, పండ్లు, పూలతో పాటు పలురకాలైన 3,000 మొక్కలను పెంచుతున్నారు. వాటికి ఉదయం, సాయంత్రం ట్రాక్టర్ ట్రాలీ సహాయంతో గ్రామ పంచాయతీ సిబ్బంది నీటిని పోస్తూ కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు. పల్లె ప్రగతి కింద గ్రామానికి వచ్చిన నిధుల నుంచి పది శాతం గ్రీన్ బడ్జెట్గా కేటాయించి నర్సరీ, ఎవెన్యూ ప్లాంటేషన్ను ఏర్పాటు చేశారు.
మరుగుదొడ్లు.. ఇంకుడు గుంతలు..
ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమష్టి కృషితో కిష్టంపేటను స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దు కుంటున్నారు. గ్రామంలో 599 వ్యక్తిగత మరు గుదొడ్లు ఉన్నాయి. 596ఇంకుడు గుంతలను నిర్మించారు. నీటిని వృథా చేయకుండా ఇంకుడు గుంతల ద్వారా సద్వినియోగం చేసు కుంటున్నారు. గ్రామంలో రైతులు ఎప్పటికప్పు డు తమ సమస్యలపై చర్చించుకు నేందుకు వీలుగా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రైతు వేదికను నిర్మించారు. రైతు బంధు సమితి సభ్యులు, గ్రామ రైతులతో చర్చించేందుకే వీటిని వేదికలుగా వినియోగిస్తున్నారు.
పరిశుభ్రతకు పెద్దపీట..
గ్రామంలో వాడవాడలా సీసీ రోడ్లు ఏర్పాటు చేశారు. వీటికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం చేపట్టారు. రోడ్లతో పాటు మురుగు కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రోజూ రోడ్లను శుభ్రం చేస్తుండడంతో అద్దంలా మెరుస్తున్నా యి. జనాభా ప్రాతిపదికన కిష్టంపేట గ్రామానికి ఏడాదికి రూ.60,80,652 నిధులు వస్తున్నా యి. గ్రామంలో ఎనిమిది మంది పారిశుధ్య కార్మికులున్నారు. వారికి ఏడాదికి రూ.8,16,000 జీతాలు చెల్లిస్తున్నారు. పారిశు ధ్యంలో భాగంగా గ్రామంలో తడి, పొడి చెత్త సేకరణకు 1,866 బుట్టలు పంపిణీ చేశారు. పారిశుధ్య కార్మికులు ఇంటింటా తడి, పొడి చెత్తను సేకరించి, ట్రాక్టర్ ట్రాలీ సహాయంతో ఊరి పొలిమేరలోని డంప్యార్డులో వేస్తున్నా రు. సెగ్రిగేషన్ షెడ్డులో వాటిని (ప్లాస్టిక్, ఇనుప వస్తువులు) వేర్వేరు గదుల్లో ఉంచుతున్నారు.