బొప్పాపూర్లో మంత్రి రామన్న పర్యటన
రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు
గౌడ సంఘం ఫంక్షన్హాల్, రైతు వేదిక, పెట్రోల్బంకుకు ప్రారంభోత్సవాలు
గ్రామస్తులతో మమేకం lస్వయంగా అర్జీలు స్వీకరణ
చిన్నారులతో సెల్ఫీలు
సిరిసిల్ల/ ఎల్లారెడ్డిపేట, మార్చి 23: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో పర్యటించారు. గ్రామస్తులతో మమేకమవుతూ.. మంచీ చెడులూ తెలుసుకుంటూ.. అర్జీలు స్వీకరిస్తూ.. చిన్నారులతో సెల్ఫీలు దిగుతూ.. ముందుకు సాగారు. ముందుగా రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పూజలు చేసిన ఆయన, ఆ తర్వాత దాత చిదుగు గోవర్ధన్ సొంత ఖర్చులతో నిర్మించిన గౌడ సంఘం ఫంక్షన్హాల్, ఏసీ రైతు వేదికకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్బంక్ను ప్రారంభించి, మొక్క నాటారు.
ఎస్సారార్ జలాశయం నుంచి ఎగుమమానేరును నింపేందుకు కాలువ నిర్మాణ పనులు సాగుతున్నాయి. కూడవెళ్లి వాగులోకి కాళేశ్వర జలాలు వస్తున్నాయి. ఆ నీరంతా ఎగువమానేరులోకి చేరుతుంది. మీ శాసన సభ్యుడిగా కేసీఆర్ ఆశీస్సులతో ప్రాజెక్టుకు శాశ్వత జలకళ తీసుకువస్తా. కరువు నేలను సస్యశ్యామలం చేసి రైతుల రుణం తీర్చుకుంటా.
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో పర్యటించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత వచ్చిన అమాత్యుడు సాయంత్రం 4.55 గంటల వరకు పర్యటించి, గ్రామస్తులతో మమేకమయ్యారు. కుశల ప్రశ్నలు అడుగుతూ.. ప్రజలు ఇచ్చిన అర్జీలను తీసుకుంటూ.. సమస్యలు తెలుసుకుంటూ.. ముందుకు కదిలారు. ముందుగా 3.15 గంటలకు సిద్ధోగం వేడుకల్లో పాల్గొన్నారు. బైండ్ల పూజారులు బండారు బొట్టు పెట్టి ఆహ్వానించగా, మహిళలు తిలకం దిద్దారు. రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడే బైండ్ల పూజారులు, గౌడ సంఘం నాయకులతో మాట్లాడారు. ఆలయం నుంచి బయటకు వస్తూ చిన్నారులతో సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత జీపీ కో-ఆప్షన్ సభ్యుడు, సామాజిక కార్యకర్త చిదుగు గోవర్ధన్గౌడ్ సొంత ఖర్చులతో నిర్మించిన గౌడ ఫంక్షన్హాల్కు 24 లక్షల వ్యయంతో నిర్మించిన ఎయిర్ కండిషన్డ్ రైతువేదికకు ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం బొప్పాపూర్-కోరుట్లపేట రహదారిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డితో కలిసి ప్రారంభించి, తిరుగుపయనమయ్యారు. ఆయనవెంట నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ, ఆర్బీఎస్ జిల్లా కన్వీనర్ గడ్డం నర్సయ్య, గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, అదనపు కలెక్టర్ అంజయ్య, టీఆర్ఎస్ జిల్లా ఇన్చార్జి తోట ఆగయ్య, ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పీటీసీ చీటి లక్ష్మణ్రావు, ఏఎంసీ చైర్మన్ కొండ రమేశ్గౌడ్, ఆర్బీఎస్ మండల కన్వీనర్ రాధారపు శంకర్, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు కొండాపురం బాల్రెడ్డి, తదితరులు ఉన్నారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల కృతజ్ఞతలు
పీఆర్సీ ప్రకటన సందర్భంగా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు బొప్పాపూర్లో మంత్రి కేటీఆర్కు పుష్పగుచ్ఛం అందించారు. టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎలుసాని ప్రవీణ్, జిల్లా అధికారుల సంఘం అధ్యక్షుడు రణధీర్రెడ్డి, ఉపాధ్యాయులు శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా అధికార సంఘం నాయకులు సీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, ఎంపీడీవోలు, సిబ్బంది, టీఎన్జీవో నాయకులు సుదర్శన్, వహీద్, శ్రీకాంత్, రియాజ్, రాజేందర్ ఉన్నారు.