ఆది సాయికుమార్, సురభి జంటగా నటిస్తున్న చిత్రం ‘శశి’. శ్రీనివాస్ నాయుడు నడికట్ల దర్శకుడు. ఆర్.పి.వర్మ, సి.రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు నిర్మాతలు. ఈ నెల 19న ప్రేక్షకులముందుకురానుంది. ఆదివారం ప్రీరిలీజ్ వేడుక జరిగింది. యువ హీరోలు రానా, నాగశౌర్య, సందీప్కిషన్, విశ్వక్సేన్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు మాట్లాడుతూ ‘ఈ చిత్ర టీజర్ను చిరంజీవి విడుదల చేయడం టీమ్ అందరికి ఉత్సాహాన్నిచ్చింది. పవన్కల్యాణ్ ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాకు మంచి హైప్ ఇచ్చారు. ఆది ఇందులో గత చిత్రాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తాడు’ అన్నారు. ‘దర్శకుడు కథ చెప్పినప్పుడే ఎగ్జయిటింగ్గా అనిపించింది. సంగీత దర్శకుడు అరుణ్ నా కెరీర్లోనే ఉత్తమ పాటలిచ్చారు. చంద్రబోస్ రాసిన పాటకు అద్భుత ఆదరణ లభించడం ఆనందంగా ఉంది. నా సినీ ప్రయాణంలో గుర్తుండిపోయే చిత్రమవుతుంది’ అని హీరో ఆది తెలిపారు. నిర్మాత సోదరుడు అశోక్కుమార్ మాట్లాడు తూ ‘టీమ్ అందరి సమిష్టి కృషితో సినిమా అద్భుతం గా వచ్చింది. ఈ సినిమా కోసం ఆది సాయికుమార్ ఎంతగానో కష్టపడ్డారు. తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని అందించే చిత్రమవుతుంది’ అని పేర్కొన్నారు. కథానుగుణంగా ఆరు పాటలు అద్భుతంగా కుదిరాయని సంగీత దర్శకుడు అరుణ్ తెలిపారు.