వికారాబాద్, జూన్ 7, (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. నగరంలోని మంత్రి కార్యాలయంలో సోమవారం వికారాబాద్ జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ మహిళా సంఘాల ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రుణాలు పొందిన సంఘాలు వాటితో లబ్ధిపొందేలా నిరంతరం అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో గతేడాది 11,252 సంఘాలకు రూ.304 కోట్ల రుణాలు అందించగా.. ఈసారి 14230 సంఘాలకు రూ.360 కోట్ల రుణాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 66లక్షల పని దినాలు కల్పించి వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ముందు నిలిచిందన్నారు. మహిళా సంఘాల సభ్యులకు గ్రామానికి 5 చొప్పున వివిధ రకాల దుకాణాలకు 3,218 మంది మహిళలను గుర్తించామని, 30 యూనిట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ నెల 15 నుంచి వాటిని స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారన్నారు.
గ్రామాల్లో జీవనోపాధి కొరకు స్థానిక వనరులను వినియోగించుకుంటూ ఆయా సభ్యులకు రూ.లక్ష నుంచి రూ.5లక్షల వరకు రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. ఎస్హెచ్జీ స్టోర్లతో నాణ్యమైన వస్తువులు, నిత్యావసర సరుకులు తక్కువ ధరకే లభిస్తాయన్నారు. జిల్లాలో మొత్తం లక్షా 98వేల జాబ్ కార్డులుండగా.. 98వేల మంది వివిధ రకాల పనులు చేస్తున్నారన్నారు. మోమిన్పేట, కుల్కచర్ల మాదిరిగా తాండూరు, ధారూర్, పూడూర్లో రైతుల పనిముట్లు విక్రయించే ఏరువాక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో నూతనంగా మరో 2వేల సంఘాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లాలో 1200 యూనిట్ల మేకలు, గొర్రెల కోసం ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో పీడీ కృష్ణన్, అడిషనల్ పీడీ నర్సింహులు, ఏపీడీ సరళ పాల్గొన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 3,172 ఎస్హెచ్జీ స్టోర్లు..
షాబాద్, జూన్ 7 : రంగారెడ్డి జిల్లాలో 3,172 ఎస్హెచ్జీ స్టోర్లు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని, అందుకోసం దాదాపు రూ.33 కోట్లు అందించబోతున్నామని మంత్రి సబితారెడ్డి అన్నారు. సోమవారం తన కార్యాలయంలో రంగారెడ్డిజిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, సెర్ప్ పనితీరుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి గ్రామాల్లోనూ స్టోర్లు ఏర్పాటు చేస్తామన్నారు. వ్యవసాయ పనిముట్లను సమకూర్చుకోవడానికి రైతు సేవా కేంద్రాలను ఇప్పటికే యాచారం, నేదునూర్లో ఏర్పాటు చేశామని, త్వరలోనే కేశంపేట, మాడ్గుల, చేవెళ్లలోనూ ఏర్పాటు చేస్తామన్నారు. గతేడాది రూ.480 కోట్లను రుణాలు అందజేయగా, ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.700 కోట్లు అందించేందుకు ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. గతేడాది ఏర్పాట్లు చేసిన 2,260 కొత్త స్వయం సహాయక సంఘాలకు ఈ సారి రుణాలను అందించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. జిల్లాలోని గిరిజన రైతుల పంట పొలాల్లో బోర్లు వేసేందుకు, పంట పొలాలను అభివృద్ధి చేసేందుకు ఎన్ని నిధులనైనా వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, అర్హులైన గిరిజనులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ప్రభాకర్, అదనపు పీడీ జంగారెడ్డి, నీరజ పాల్గొన్నారు.