జైపూర్: బెంగళూరు-జైపూర్ వాయు మార్గంలో ఒక అరుదైన ఘటన చోటుచేసుకుంది. విమానం గాల్లో ఎగురుతుండగా ఒక మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే స్పందించిన విమాన సిబ్బంది అదే విమానంలో ఉన్న ఓ వైద్యుడి సాయంతో ఆమెకు సుఖ ప్రసవం అయ్యేలా సాయపడ్డారు. దాంతో సదరు మహిళ ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇండిగో సంస్థకు చెందిన ఓ విమానం బుధవారం ఉదయం కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి రాజస్థాన్ రాజధాని జైపూర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా, మహిళ ప్రసవించిన వెంటనే ఇండిగో సిబ్బంది జైపూర్ విమానాశ్రయ సిబ్బందిని కూడా అప్రమత్తం చేశారు. ఇండిగో సిబ్బంది ఇచ్చిన సమాచారం జైపూర్ విమానాశ్రయ సిబ్బంది విమానం ల్యాండింగ్ కావడానికి ముందే వైద్య సిబ్బందిని, అంబులెన్స్ను సిద్ధం చేశారు. విమానం ఉదయం 8.30 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకోగానే ప్రసవించిన మహిళను, బిడ్డను అంబులెన్స్లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.
ఇదిలావుంటే ఆపదలో మహిళ సుఖ ప్రసవానికి సాయపడ్డ డాక్టర్ సుబాహన నజీర్ను ఇండిగో సంస్థ అభినందించింది. జైపూర్ విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది ఆయనకు సాధారంగా స్వాగతం పలికి థ్యాంక్యూ కార్డును అందజేశారు. కాగా, విమానంలో మహిళ ప్రసవించడం ఇదే తొలిసారి కాదని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు. 2009, 2017, 2020లలోనూ విమానంలో మహిళలు ప్రసవించారని తెలిపారు.
2009లో మలేషియాకు చెందిన ఓ మహిళ ఎయిర్ ఏషియా విమానంలో దుబాయ్ నుంచి మనీలా వెళ్తూ ఆడబిడ్డకు జన్మనిచ్చిందని గుర్తుచేశారు. అదేవిధంగా 2017లో జెట్ ఎయిర్వేస్ విమానంలో కూడా ఒక మహిళ ఆడపిల్లను కన్నదని చెప్పారు. 2020, అక్టోబర్లో కూడా ఇండిగోకే చెందిన ఓ విమానం ఢిల్లీ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా మహిళ ప్రసవించిందని అధికారులు తెలిపారు.