ముంబై: ఇండియన్ టీమ్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ మధ్య మాటల యుద్ధ నడుస్తూనే ఉంది. తాజాగా ముగిసిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో జడేజా దారుణంగా విఫలమవడంతో అతనిపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించాడు మంజ్రేకర్. ఈ మ్యాచ్లో కేవలం ఒక వికెట్ తీసిన జడ్డూ.. తొలి ఇన్నింగ్స్లో 15, రెండో ఇన్నింగ్స్లో 16 పరుగులు మాత్రమే చేశాడు. గత కొన్నేళ్లుగా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్తో అదరగొడుతున్న జడేజాకు ఈ మ్యాచ్లో పరిస్థితులు అస్సలు కలిసి రాలేదు. అయితే ఇలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఓ పేస్ బౌలర్ను కాకుండా జడేజాను ఆడించడంపై మంజ్రేకర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.
మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇండియా వ్యవహరించిన తీరు వింతగా ఉంది. ఆకాశం మేఘావృతమై, మ్యాచ్ వర్షం వల్ల ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమైనా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం చర్చించదగిన విషయమే. జడేజాను టీమ్లోకి తీసుకుంది బ్యాటింగ్ కోసమే. అతని లెఫ్టామ్ స్పిన్ కోసం కాదు. అతన్ని కేవలం బ్యాటింగ్ కోసమే టీమ్లోకి తీసుకుంటారు. దానిని నేను ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నాను అని మంజ్రేకర్ అన్నాడు.
టీమ్లోకి స్పెషలిస్ట్ ప్లేయర్స్నే ఎంచుకోవాలి. ఒకవేళ పిచ్ పొడిగా ఉంది, స్పిన్ అయ్యే చాన్స్ ఉంది అంటే అశ్విన్తోపాటు జడేజాను తీసుకోవడంలో అర్థం ఉంది. కానీ అతన్ని కేవలం బ్యాటింగ్ కోసం తీసుకున్న వ్యూహం ఎదురు తన్నింది అని మంజ్రేకర్ అన్నాడు. హనుమ విహారిలాంటి స్పెషలిస్ట్ బ్యాట్స్మన్ను తీసుకున్నా ఇండియా పరిస్థితి మెరుగ్గా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్ ఎప్పుడూ చేసిన తప్పునే ఇండియా చేయకూడదని అంటున్నాను. ఓ వ్యక్తిని తన దగ్గర మరో బలం ఉన్నదని తీసుకొని, అవసరమైనప్పుడు పనికొస్తాడని భావించడం చేస్తున్నారు. కానీ ఒత్తిడి సమయాల్లో ఆ వ్యక్తి ఎప్పుడూ ఆ పని చేయలేదు అని పరోక్షంగా జడేజాను విమర్శించాడు.