జెరూసలేం, మే 10: గాజాలోని హమాస్ మిలిటెంట్లు సోమవారం జెరూసలేం వైపు రాకెట్లను పేల్చారు. కొన్ని వారాలుగా జెరూసలేంలో ఇజ్రాయెల్ పోలీసులకు పాలస్తీనా నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా చారిత్రక అల్ అఖ్సా మసీదు కేంద్రంగా జరిగిన ఘర్షణలో వందలాది మంది పాలస్తీనీయులు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో హమాస్ మిలిటెంట్లు రాకెట్లు పేల్చారు. ఉత్తర గాజా తీరంలో సంభవించిన పేలుడులో ముగ్గురు పిల్లలు సహా 9 మంది చనిపోయారు. జెరూ సలేంపై రాకెట్ దాడితో హమాస్ హద్దు మీరిందని, ప్రతిదాడి తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, ఉద్రిక్తతలపై ఐరాస భద్రతా మండలి సోమ వారం అత్యవసర భేటీ నిర్వహించింది.