న్యూఢిల్లీ: భారత స్టార్ స్విమ్మర్ సాజన్ ప్రకాశ్ ..ఏ-క్వాలిఫికేషన్ మార్కును అధిగమించి టోక్యో ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించాడు. దీంతో పోటీల ద్వారా విశ్వక్రీడలకు నేరుగా క్వాలిఫై అయిన తొలి భారత స్విమ్మర్గా చరిత్ర సృష్టించాడు. శనివారం ఇటలీలోని రోమ్ వేదికగా జరిగిన సెటెకోలీ ట్రోఫీ 200 మీటర్ల బటర్ఫ్లై విభాగంలో సాజన్ 1:56:38 సెకన్లలోనే గమ్యాన్ని చేరి.. టోక్యో ఒలింపిక్స్కు ‘ఏ’ స్టాండర్డ్లో క్వాలిఫై అయ్యాడు. దీంతో పాటు తన పేరిటే ఉన్న జాతీయ రికార్డు(1:56:96)ను తిరుగరాశాడు. అలాగే ఒలింపిక్స్ ఏ క్వాలిఫికేషన్ మార్కు కంటే 0.19 సెకన్ల ముందే లక్ష్యాన్ని చేరి సత్తాచాటాడు. క్వాలిఫయర్స్ ద్వారా 2016 రియో ఒలింపిక్స్లో సాజన్ బరిలోకి దిగాడు. ఇక టోక్యో ఒలింపిక్స్లో సాజన్తో పాటు భారత్ తరఫున మాన పటేల్ కూడా పాల్గొనబోతోంది. యూనివర్సిటీ స్థానాల్లో భాగంగా స్విమ్మింగ్ సమాఖ్య పటేల్ను ఎంపిక చేసింది. యూనివర్సిటీ కోటా కింద ప్రతీ దేశం ఓ పురుష, మహిళా స్విమ్మర్ను ఒలింపిక్స్కు నేరుగా పంపే అవకాశం ఉంటుంది. అయితే సాజన్ పోటీల ద్వారా ఏ క్వాలిఫికేషన్ సాధించడంతో స్విమ్మింగ్ సమాఖ్య ఎంపిక చేసిన శ్రీహరి నటరాజన్ టోక్యోకు దూరం కానున్నాడు.