ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో ప్రాతినిధ్యంపై సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి. కరోనా వైరస్ విజృంభణతో అర్హత టోర్నీలు రద్దు, వాయిదా పడటం వీరిద్దరి ఒలింపిక్స్ అవకాశాలపై నీళ్లు చల్లింది. మహమ్మారి కారణంగా ఇప్పటికే అర్హత సమయాన్ని పెంచిన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్)తిరిగి టోర్నీల నిర్వహణ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ కారణంగా జూలైలో జపాన్ వేదికగా మొదలయ్యే ఒలింపిక్స్ నుంచి సైనా, శ్రీకాంత్ పూర్తిగా దూరమయ్యారు.
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. తమ అద్భుతమైన ఆటతీరుతో భారత బ్యాడ్మింటన్పై చెరుగని ముద్ర వేసిన తెలుగు తేజాలు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్.. టోక్యో ఒలింపిక్స్కు దూరమయ్యారు. ఈ విషయాన్ని బీడబ్ల్యూఎఫ్ శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుత ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పులు చేసే అవకాశం లేదని స్పష్టం చేసిన బీడబ్ల్యూఎఫ్..జూన్ 15లోగా ఎలాంటి అర్హత టోర్నీలు నిర్వహించబోమని పేర్కొంది. దీంతో ఇన్ని రోజులు విశ్వక్రీడలకు అర్హతపై సైనా, శ్రీకాంత్ పెట్టుకున్న ఆశలు అడిఆశలయ్యాయి. కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఇండియా ఓపెన్, మలేషియా ఓపెన్, సింగపూర్ ఓపెన్ వరుసగా రద్దు, వాయిదా పడటం ఈ ఇద్దరి అవకాశాలను దెబ్బతీసిందని చెప్పొచ్చు. గతేడాది మహమ్మారి వ్యాప్తితో అర్హత టోర్నీల సమయాన్ని దాదాపు రెండు నెలల పాటు పొడిగించిన బీడబ్ల్యూఎఫ్ ప్రస్తుత ర్యాంకింగ్స్లో ఎలాంటి మార్పులు ఉండవని పేర్కొంది. దీనిపై బీడబ్ల్యూఎఫ్ ప్రధాన కార్యదర్శి థామస్ లాండ్ శుక్రవారం మాట్లాడుతూ ‘విశ్వక్రీడలకు అర్హత ప్రక్రియను ఇక్కడితో ఆపేస్తున్నాం. ఒలింపిక్స్ మొదలయ్యే లోగా తిరిగి ఎలాంటి టోర్నీల నిర్వహణ అనేది ఉండదు. అర్హత పాయింట్లు దక్కించుకునేందుకు ప్లేయర్లకు అవకాశం ఉండదు. పునరుద్ధరించబడిన అర్హత ప్రక్రియ ప్రకారం జూన్ 15 వరకు గడువు ముగుస్తుంది. ప్రస్తుతమున్న ర్యాంకింగ్స్ను మార్చే ప్రసక్తే లేదు. ఒలింపిక్స్కు అర్హత సాధించిన వారి తుది జాబితాను త్వరలోనే ప్రకటిస్తాం’ అని పేర్కొన్నారు.
బీడబ్ల్యూఎఫ్ నిర్దేశించిన ప్రకారం జూన్ 15లోగా ర్యాంకింగ్స్లో టాప్-16లో ఉన్న వారు నేరుగా అర్హత సాధిస్తారు. దీనిని అనుసరించి ప్రస్తుతం భారత్ నుంచి మహిళల సింగిల్స్లో పీవీ సింధు, పురుషుల నుంచి సాయి ప్రణీత్ విశ్వక్రీడల బరిలోకి దిగనున్నారు. బీడబ్యూఎఫ్ ర్యాంకింగ్స్ ప్రకారం హైదరాబాదీ సైనా నెహ్వాల్ 22వ ర్యాంక్లో ఉండగా, శ్రీకాంత్ 20వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ కారణంగా అర్హత మార్క్ను అందుకోవడంలో విఫలమైన సైనా, శ్రీకాంత్..ఒలింపిక్స్ అవకాశాలను చేజార్చుకున్నారు. డబుల్స్ విషయానికొస్తే సాత్విక్సాయిరాజ్ రాంకీరెడ్డి, చిరాగ్శెట్టి పోటీపడనున్నారు. ఇదిలా ఉంటే అర్హతపై ఆయా జాతీయ ఒలింపిక్ సంఘాలతో పాటు బ్యాడ్మింటన్ సమాఖ్యలకు బీడబ్ల్యూఎఫ్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని తెలిసింది. ఏదైనా మార్పులు, చేర్పుల కోసం మరికొన్ని వారాలు పట్టే అవకాశముంది. టోక్యో ఒలింపిక్స్ కోసం వివిధ క్రీడాంశాల నుంచి జాబితాను పంపేందుకు జూలై 5ను ఆఖరి తేదీగా నిర్వాహకులు ప్రకటించారు.