దేశవ్యాప్తంగా కరోనా బారినపడుతున్న అథ్లెట్లను ఆదుకునేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) సిద్ధమైంది. కొవిడ్ సెకండ్ వేవ్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న అథ్లెట్లు, కోచ్లను ఆదుకునే కార్యక్రమానికి కేంద్ర క్రీడా శాఖ, సాయ్, భారత ఒలింపిక్ సంఘం (ఐఓసీ) కలిసి శ్రీకారం చుట్టాయి. ఇందు కోసం తెలంగాణ నుంచి భారత హ్యాండ్ బాల్ సమాఖ్య అధ్యక్షులు జగన్ మోహన్ రావు, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం కార్యదర్శి, జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఐఓసీ ప్రతినిధులుగా నియమితులయ్యారు.
వైద్య, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అథ్లెట్లు, కోచ్లు ఆన్ లైన్ లో ఈ లింక్ (www.research.net/r/sai-ioa-covid-19) ఓపెన్ చేసి తమ వివరాలు నమోదు చేసుకుంటే తగిన సాయం చేయనున్నామని జగన్మోహన్ రావు తెలిపారు. ఒకసారి తమ పేరు నమోదు చేసుకోగానే ఐఓసీ నుంచి తమకు సమాచారం అందుతుందని దాన్ని పరిశీలించి తక్షణమే స్పందిస్తామని చెప్పారు. ఐఓసీ, రాష్ట్ర క్రీడా మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకొని కరోనా సోకి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందించడం.. అలానే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారికి తగిన సహాయం అందించడానికి కృషి చేస్తామని జగన్ మోహన్ రావు తెలిపారు.