న్యూఢిల్లీ: మనదేశ ఇంధన అవసరాలకు సరిపడా ముడి చమురు సరఫరా చేస్తున్న దేశాల్లో ఇప్పటి వరకు సౌదీ అరేబియాకు రెండో స్థానం ఉండేది. కానీ సౌదీ అరేబియా ఆ స్థానాన్ని కోల్పోనున్నది. ఆ స్థానాన్ని అమెరికా భర్తీ చేయనున్నది. సౌదీ అరేబియా సారధ్యంలోని ఒపెక్ ప్లస్ దేశాల కూటమి ముడి చమురు ఉత్పత్తి తగ్గించడంతోపాటు చౌక ధరకే అమెరికా ముడి చమురు లభించడం దీనికి కారణం అని తెలుస్తున్నది.
గత నెలలో అమెరికా నుంచి 48 శాతం ముడి చమురు దిగుమతి పెరిగింది. అంటే ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో 5,43,500 బీపీడీల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకున్నది. ఇది భారత్ ఓవరాల్ దిగుమతుల్లో 14 శాతం. సౌదీ అరేబియా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు 4,45,200 బీపీడీలకు తగ్గింది. ఇది దశాబ్ది కనిష్టంగా నమోదైంది.
గతేడాదితో పోలిస్తే సౌదీ నుంచి దిగుమతి రికార్డు స్థాయిలో 42 శాతం తగ్గిపోయింది. తద్వారా భారత్కు ముడి చమురు ఎగుమతి చేసే దేశాల జాబితాలో సౌదీ నాలుగో స్థానానికి పడిపోయింది. 2006 జనవరి నుంచి ఇలా సౌదీ ర్యాంక్ పడిపోవడం తొలిసారి. బారత్కు ప్రస్తుతం అత్యధికంగా ముడి చమురు ఎగుమతి చేస్తున్న దేశాల్లో ఇరాక్ మొదటి స్థానంలో ఉంది.