ముంబై : మాస్టర్ బ్లాస్టర్, మాజీ టీమిండియా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా సోకిన సచిన్ క్వారెంటైన్లో ఉన్నట్లు ఇవాళ ఉదయం తన ట్విట్టర్లో వెల్లడించారు. ఇటీవల నిత్యం కరోనా టెస్టింగ్ చేయించుకుంటూనే ఉన్నాని, కోవిడ్కు దూరంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆ ట్వీట్లో సచిన్ తెలిపారు.
అయితే తాజాగా నిర్వహించిన టెస్టింగ్లో కరోనా పాజిటివ్ వచ్చినట్లు సచిన్ పేర్కొన్నారు. స్వల్పంగా తనకు లక్షణాలు ఉన్నట్లు తెలిపారు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలో నెగటివ్గా తేలినట్లు ఆయన చెప్పారు. కరోనా సోకడం వల్ల ఇంట్లోనే క్వారెంటైన్లో ఉన్నట్లు తన ట్వీట్లో సచిన్ వెల్లడించారు.
డాక్టర్లు ఇచ్చిన సూచనల ప్రకారమే అన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నట్లు మేటి క్రికెటర్ తెలిపారు. తనతో పాటు, దేశంలోని అనేక మందికి మద్దతు ఇస్తున్న హెల్త్కేర్ ప్రొఫెషనల్స్కు థ్యాంక్స్ చెబుతున్నానని సచిన్ తన ట్వీట్లో తెలిపారు.