బడంగ్పేట, జనవరి 11: రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. బాలాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. కొత్తపేట నివాసి మహమ్మద్ ముబారక్ సిగర్ (33) బాలాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో రౌడీషీటర్. అతడిపై దాదాపు 23 క్రిమినల్ కేసులున్నాయి. హత్యలు, కిడ్నాప్లు, దాడులు చేస్తూ స్థానికంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించాడు. పలు నేరాల్లో కీలకంగా వ్యవహరించిన ముబారక్కు చాలా గ్యాంగులతో గొడవలున్నాయి.
ఓ కేసులో జైలుకు వెళ్లిన అతడు ఇటీవలే బెయిల్పై విడుదలయ్యాడు. బుధవారం అర్ధరాత్రి ముబారక్ను షాహిన్నగర్లోని వాదే ముస్తాఫా కాలనీ సమీపంలో ఉన్న నిర్మానుష ప్రదేశంలో కత్తులో పొడిచి దారుణంగా హత్య చేశారు. మర్మాంగం కూడా కోశారు. పాత కక్షల వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హతుడి సోదరుడు హమీర్ సిగార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహేశ్వరం డీసీపీ సునీత, ఏసీపీ శ్రీనివాస్ యాదవ్, బాలాపూర్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్లను రప్పించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసు అధికారులు తెలిపారు.