పీఎం కిసాన్ నిధులు విడుదల
న్యూఢిల్లీ, మే 14: గ్రామీణప్రాంతాల్లో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నదని, దానినుంచి రక్షణకు టీకాలు వేయించుకోవాలని, మాస్కులు, భౌతికదూరం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని దేశప్రజలకు ప్రధాని మోదీ సూచించారు. పీఎం-కిసాన్ పథకం కింద 8వ విడుత నగదు సాయాన్ని శుక్రవారం విడుదల చేశారు.
రూ.20,000 కోట్ల విడుదల
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 8వ విడుత కింద 9.5 కోట్ల మందికిపైగా రైతులకు రూ.20 వేల కోట్లను మోదీ శుక్రవారం విడుదల చేశారు. ఒక్కోరైతుకు రూ.2 వేల చొప్పున లభించనుంది. ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులైన 14 కోట్ల మంది రైతులకు ఏటా రూ.6 వేల మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో (రూ.2 వేలచొప్పున) అందిస్తున్నారు. రైతుల బ్యాంకుఖాతాల్లో ఈ మొత్తం జమ అవుతున్నది.