తాండూరు రూరల్, జూన్ 8 : గుర్తింపు పొందిన ఫర్టిలైజర్స్ దుకాణాదారుల వద్ద ఎరువులు, పురుగుల మందు రైతులు కొనుగోలు చేయాలని తాండూరు రూరల్ సీఐ జలెందర్రెడ్డి అన్నారు. మంగళవారం సర్కిల్ పరిధిలోని కార్యాలయంలో ఫర్టిలైజర్స్, రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మంది ఫర్టిలైజర్స్ దుకాణదారులు ప్రభుత్వం నిషేధించిన గడ్డిమందు విక్రయిస్తున్నారనే సమాచారం ఉంది, వాటిని అమ్మితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు ఎరువులు, మందులు విక్రయిస్తే తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని సూచించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసేముందు వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు తీసుకోవాలన్నారు. ఎంఆర్పీ ధరలకు మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో ఎస్సై ఏడుకొండలు పాల్గొన్నారు.
మర్పల్లిలో..
మర్పల్లి, జూన్ 8: నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ వెంకటశ్రీను అన్నారు. మంగళవారం పోలీస్స్టేషన్లో వ్యవసాయ అధికారులు, సర్పంచులతో నకిలీ విత్తనాలు, క్రిమి సంహారక మందులు, కొవిడ్-19 లాక్డౌన్పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానకాలం పంటలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎవరైనా ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపుల్లో నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందులు అమ్మినట్లు తెలిస్తే తమకు సమాచారం అందించాలన్నారు. కొన్నిగ్రామాల్లో లైసెన్స్ లేకుండా విత్తనాలు, ఎరువులు అమ్ముతున్నారని మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లేశం, సర్పంచులు ప్రస్తావించగా వ్యవసాయ అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించి చర్యలు తీసుకుంటామన్నారు. లైక్డౌన్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఈవో మహేశ్, సర్పంచులు పాల్గొన్నారు.