న్యూఢిల్లీ: భారత టీ20 జట్టుకు కొత్త సారథిని చూడబోతున్నామా..? మూడు ఫార్మాట్లలో విరాట్పై పనిభారం పెరిగి అతడి బ్యాటింగ్పై ప్రభావం పడుతున్న నేపథ్యంలో పొట్టి క్రికెట్ నాయకత్వ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. టీ20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి విరాట్ తప్పుకోనున్నాడని, హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి ఇలాంటి వార్తలే జాతీయ మీడియాలో ప్రసారమయ్యాయి. అక్టోబర్లో దుబాయ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ ఫార్మాట్ నుంచి విరాట్ తప్పుకోనున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తలను బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ ఖండించారు. ఇవన్నీ తప్పుడు వార్తలేనని, మూడు ఫార్మాట్లలోనూ కోహ్లీనే కెప్టెన్గా కొనసాగుతాడని స్పష్టం చేశారు. వైట్ బాల్ కెప్టెన్గా రోహిత్ బాధ్యతలు స్వీకరించడం లేదని, అసలు అందుకు సంబంధించిన చర్చలేమీ బీసీసీఐలో జరుగలేదని ఆయన తేల్చి చెప్పారు. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా రికార్డు ఉన్న విరాట్.. ఐసీసీ టోర్నీల్లో మాత్రం తేలిపోతుండటం అతడికి ఇబ్బందిగా మారింది.-