జనగామ, మే 4 (నమస్తే తెలంగాణ) : తనపై భూ కబ్జా ఆరోపణలు చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మండిపడ్డారు. దమ్ముంటే జనగామకు చర్చకు రావాలని.. తాను గుంట భూమి ఆక్రమించినట్టు లేదా అసైన్డ్, ప్రభుత్వ భూమి ఉన్నట్టు ఆధారాలు చూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. మంగళవారం జనగామలో జరిగిన ముస్లింలకు రంజాన్ గిఫ్ట్ల పంపిణీ కార్యక్రమంలో ముత్తిరెడ్డి మాట్లాడారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉంటూ ఎలాంటి ఆధారాలు లేకుండా గాలి మాటలు చెప్పడం హేయమన్నారు. ఆరోపణలు రుజువు చేస్తే జనగామ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముక్కునేలకు రాసి రాజీనామా పత్రాన్ని సీఎం కేసీఆర్ చేతిలో పెడుతా.. ఈ సవాల్ను స్వీకరిస్తావా? అంటూ బండిపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఆశీర్వదించి టికెట్ ఇస్త్తే.. రెండుసార్లు జనగామ ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నారని గుర్తుచేశారు.