సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ ): కరోనా మహమ్మారి భరతం పట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే సత్ఫలితాలను ఇస్తోంది. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సర్వేలో సగటున 700 బృందాలు పాల్గొంటున్నాయి. ఇంటింటికి తిరుగుతూ భరోసా కల్పిస్తున్నాయి. అంతేకాక ప్రతి నిత్యం 40 వేలకు పైగా ఇండ్లను సందర్శించి ఎవరైనా జ్వరం, కొవిడ్ లక్షణాలతో బాధ పడుతుంటే గుర్తించి మందుల కిట్ అందజేస్తున్నాయి. ఈ కిట్లో ఉన్న డాక్సిైస్లెకిన్, పారాసిటమాల్, లెవోసెటైరిజైన్, రాంటాక్, విటమిన్-సి, విటమిన్-డి మందులను ఐదు రోజుల పాటు వాడితే కరోనా రాకుండా చూసుకోవచ్చని వివరిస్తున్నాయి.
ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా..
ప్రభుత్వం దూరదృష్టితో చేపట్టిన ర్యాపిడ్ ఫీవర్ సర్వేతో జీహెచ్ఎంసీ పరిధిలో గణనీయంగా కరోనా కేసులు తగ్గడం ఖాయమని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకంగా చేపడుతున్న ఈ సర్వే ఫలితాలపై ఇతర రాష్ట్రాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారని వైద్యారోగ్య శాఖాధికారులు పేర్కొంటున్నారు. కేవలం ఇంటింటి ఫీవర్ సర్వేనే కాకుండా అన్ని ప్రభుత్వ, ఏరియా, బస్తీ దవాఖానాల్లో కొవిడ్ ఓపీ సర్వీసులను ప్రారంభించడం కూడా మంచి పరిణామమని వారు అంటున్నారు. గతంలో పాజిటివ్ కేసులను నిర్ధారించేందుకు కొన్ని డయాగ్నోస్టిక్ కేంద్రాలు, మరికొన్ని వైద్యశాలలను ఎంపిక చేయడంతో అందరూ ఒకే దగ్గర గుమిగూడటంతో అనేక సమస్యలు తలెత్తేవి. అయితే ప్రస్తుతం నగరంలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు చేస్తుండటంతో పాటు జ్వరం, జలుబు, దగ్గు లాంటి సమస్యలు ఉన్నవారికి ఉచితంగా మందుల కిట్ అందిస్తున్నారు. ఇది కరోనా రాకుండా ముందస్తుగా నియంత్రించినట్టు అవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
నిరంతరాయంగా కంట్రోల్ రూం సేవలు..
జీహెచ్ఎంసీలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూం(040-2111 1111) నిరంతర సేవలు అందిస్తోంది. ముఖ్యంగా నగరవాసులకు టెలిమెడిసిన్, వ్యాక్సిన్, కరోనా వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టెస్టింగ్ కేంద్రాల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నది. రెండు షిఫ్టుల్లో (ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు, మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 గంటల వరకు) పని చేసే ఈ కంట్రలోల్ రూంకు వచ్చే ఫిర్యాదులను వైద్య సిబ్బంది ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటున్నారు. కొవిడ్ నివారణకై సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యంగా బాధితులు కరోనా పరీక్షలు, ఆక్సిజన్, టీకాలు తీసుకుంటే వచ్చే ఇబ్బందులు, రెమ్డెసివిర్ మందులు, వెంటిలేటర్ సౌకర్యాలపై ఆరా తీస్తున్నారని వైద్యులు వివరిస్తున్నారు.
కరోనా తగ్గుముఖం వెయ్యిలోపే పాజిటివ్ కేసులు
కరోనా వ్యాప్తి కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు..ప్రజల్లో పెరిగిన అవగాహనతో గ్రేటర్వ్యాప్తంగా కేసులు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం గ్రేటర్ పరిధిలో 984 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 457, మేడ్చల్ జిల్లా పరిధిలో 372 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో వెల్లడించింది. గత రెండువారాలుగా రోజుకు సరాసరిన 1500 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గడిచిన 5 రోజులుగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గణనీయంగా కేసులు తగ్గుతున్నాయి.
ముమ్మరంగా ఐసొలేషన్ కిట్ల పంపిణీ..
కొవిడ్ వ్యాప్తిని అడ్డుకునేందుకు జీహెచ్ఎంసీ లక్ష హోం ఐసొలేషన్ కిట్లను కొనుగోలు చేసింది. గ్రేటర్లోని ఆరు జోన్లు, 30 సర్కిళ్ల పరిధిలో ఇప్పటికే 2000 కిట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నిత్యం స్థానిక పీహెచ్సీలు ఇచ్చే బాధితుల జాబితా ఆధారంగా ఆశ కార్యకర్తలు, జీహెచ్ఎంసీ పారిశుధ్య సిబ్బంది. బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లలో పర్యటిస్తున్నారు. వారికి పలు సూచనలు, సలహాలు అందజేస్తున్నారు.