హన్మకొండ, జూన్7 : వానకాలం సీజన్ ప్రారంభమవడంతో రైతులు సాగుకు సమాయత్తమవుతున్నారు. అదునుగా వర్షాలు పడుతుండడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. నీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే పత్తి విత్తనాలు వేయగా, నీటి వసతి లేని రైతులు దుక్కు లు సిద్ధం చేసుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో వర్షపాతం
వరంగల్ అర్బన్ జిల్లాలో జూన్ ఒకటి నుంచి ఆరు వరకు 47.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాజీపేట మండలంలో అత్యధికంగా 80.5 మి.మీ, అత్యల్పం గా భీమదేవరపల్లి మండలంలో 23.3 మి.మీ వర్షపాతం నమోదైంది. వేలేరు మండలంలో 32.3, ఎల్కతుర్తి మండలంలో 45.7, కమలాపుర్లో 38, హసన్పర్తిలో 32.3, ధర్మసాగర్లో 40.9, హన్మకొండలో 58.1, వరంగల్లో 65.9, ఖిలావరంగల్లో 66.8, ఐనవోలులో 40.9 మి.మీ వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 31మి.మీ, మహబూబాబాద్లో 71.9, వరంగల్ రూరల్ జిల్లాలో 76, జనగామ జిల్లాలో 34.6, ములుగు జిల్లాలో 40.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.