లండన్: ఎనిమిది సార్లు వింబుల్డన్ ట్రోఫీ గెలిచిన టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్.. ఈ ఏడాది కూడా ఆ టోర్నీలో క్వార్టర్స్లోకి ప్రవేశించాడు. సోమవారం జరిగిన మ్యాచ్లో ఫెదరర్ 7-5, 6-4, 6-2 స్కోర్ తేడాతో ఇటలీకి చెందిన లోరెంజో సొనేగాపై అలవోక విజయం సాధించాడు. 39 ఏళ్ల రోజర్ ఈ టోర్నీలో ఆరవ సీడ్గా బరిలోకి దిగాడు. మోకాలి సర్జరీ వల్ల ఇటీవల పెద్దగా ఆటను ప్రదర్శించలేకపోతున్న ఫెదరర్ తన ఫెవరేట్ గ్రాస్కోర్టుపై చెలరేగిపోయాడు. వింబుల్డన్లో రికార్డు స్థాయిలో 18వ సారి ఫెదరర్ క్వార్టర్స్కు చేరాడు.
ఫెదరర్, లొరెంజో మధ్య తొలి సెట్ హోరాహోరీగా సాగినా.. ఆ తర్వాత రెండు సెట్లలో ఫెడెక్స్ ఆధిపత్యం చాటాడు. తొలి సెట్లో బ్రేక్ పాయింట్ సమయంలో వర్షం వల్ల మ్యాచ్ 20 నిమిషాలు నిలిచిపోయింది. కానీ ఆ తర్వాత ఫెదరర్ తన గేమ్తో ఈజీగా ప్రత్యర్థిని చిత్తు చేశాడు. వింబుల్డన్ ఓపెన్ ఎరాలో 39 ఏళ్ల వయసులో క్వార్టర్స్కు చేరిన తొలి ఆటగాడిగా ఫెదరర్ రికార్డు క్రియేట్ చేశాడు. మరో మ్యాచ్లో గారిన్పై నెగ్గిన వరల్డ్ నెంబర్ వన్ జోకోవిచ్ కూడా క్వార్టర్స్కు చేరాడు.