ఎనిమిదేండ్ల క్రితం తప్పు.. ఇప్పుడు శిక్ష
విచారణకు ఆదేశించిన ఈసీబీ
లండన్: వారం క్రితమే టెస్టు అరంగేట్రం చేసిన యువ ఆల్రౌండర్ ఓలీ రాబిన్సన్పై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) వేటు వేసింది. ఎనిమిదేండ్ల క్రితం రాబిన్సన్ చేసిన జాతివివక్షపూరిత, అసభ్య ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవడంతో ఈసీబీ అతడిని అంతర్జాతీయ క్రికెట్ నుంచి తక్షణమే సస్పెండ్ చేసింది. ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. న్యూజిలాండ్తో జరిగిన టెస్టుతో అరంగేంట్రం చేసిన రాబిన్సన్ తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 3వికెట్లతో సత్తాచాటడంతో పాటు బ్యాటింగ్లో రాణించాడు. ఇదే సందర్భంగా అతడు 2012-13 మధ్య చేసిన కొన్ని ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆసియా జాతులను కించపరిచేలా వివక్షపూరితమైన, అసభ్యకర వ్యాఖ్యలు ఆ ట్వీట్లలో ఉన్నాయి. దీంతో దుమారం చెలరేగడంతో ఈసీబీ అతడిపై చర్యలు తీసుకుంది. తక్షణమే రాబిన్సన్ జాతీయ జట్టును వీడి ససెక్స్ కౌంటీకి వెళ్లిపోతాడని, న్యూజిలాండ్తో రెండో టెస్టుకు అందుబాటులో ఉండడని సోమవారం ప్రకటించింది. అయితే ఎనిమిదేండ్ల క్రితం తాను చేసిన ట్వీట్లకు సిగ్గు పడుతున్నానంటూ తొలి టెస్టు ప్రారంభమైన బుధవారమే రాబిన్సన్ క్షమాపణలు చెప్పాడు. తాను జాతివివక్షకు వ్యతిరేకమని, తెలిసీ తెలియని వయసులో చేసిన ఆ ట్వీట్లకు ఇప్పుడు చింతిస్తున్నానని భావోద్వేగపూరితంగా పేర్కొన్నాడు.
ఈసీబీ పునరాలోచించాలి
రాబిన్సన్ విషయంలో ఈసీబీ పునరాలోచించాలని బ్రిటన్ ప్రభుత్వ పెద్దలు సూచించారు. ‘రాబిన్సన్ ట్వీట్లు చాలా తప్పు. కానీ అప్పుడు అతడు టీనేజర్. ఇప్పుడు పరిణితి సాధించిన వ్యక్తిగా అతడు క్షమాపణలు చెప్పాడు’ అని బ్రిటన్ సాంస్కృతిక, క్రీడాశాఖ సెక్రటరీ ఒలీవర్ డోవెన్ అన్నారు. మరోవైపు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా మద్దతుగా నిలిచాడు. రాబిన్సన్ వేటుకు గురికావడం బాధించిందని భారతఅశ్విన్ అన్నాడు.