భారత్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. కరోనా బాధితులకు కొన్నిచోట్ల అత్యవసర చికిత్స కూడా అందట్లేదు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆక్సిజన్ సిలిండర్ల కొరతతో జనం ఊపిరి ఆడక చనిపోతున్నారు. కరోనా బాధితులకు సాయం చేసేందుకు యువ వికెట్ కీపర్, బ్యాట్స్మన్ రిషబ్ పంత్ ముందుకొచ్చాడు.
కొవిడ్ రోగులకు ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, మెడికల్ కిట్లు, ఔషధాలు అందించడానికి హేమకుంట్ ఫౌండేషన్కు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించాడు. గ్రామీణ ప్రాంతాలతో పాటు మెట్రోయేతర నగరాల్లో అవసరమైన వారికి సహాయం చేయడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు పంత్ తెలిపాడు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందని పంత్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ట్విటర్లో ఓ లేఖను కూడా పోస్ట్ చేశాడు. ఐపీఎల్లో పంత్ ఢిల్లీ క్యాపిటల్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.