లండన్: ఇంగ్లండ్తో సిరీస్కు ముందు ఇండియన్ టీమ్లో ఓ ప్లేయర్ కరోనా బారిన పడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలుసు కదా. అయితే ఆ ప్లేయర్ వికెట్ కీపర్ రిషబ్ పంతే అని స్పోర్ట్స్ టాక్ అనే మీడియా సంస్థ తన రిపోర్ట్లో వెల్లడించింది. అంతేకాదు వారం కిందటే అతనికి కరోనా సోకిందని, అయితే లక్షణాలేవీ లేవని తెలిపింది. యూరోలో భాగంగా లండన్లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ మధ్య జరిగిన మ్యాచ్ చూడటానికి పంత్ వెళ్లిన విషయం తెలిసిందే.
పంత్ ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నాడు. అతడు డర్హమ్ వెళ్లిన టీమ్తో ఇప్పట్లో కలిసే అవకాశం లేదు. అటు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కూడా ఓ ప్లేయర్కు కరోనా సోకిన మాట నిజమే అని చెప్పినా.. అతని పేరు మాత్రం చెప్పలేదు. అవును, ఓ ప్లేయర్కు కరోనా వచ్చింది. అతడు 8 రోజులుగా ఐసోలేషన్లో ఉంటున్నాడు. అతడు హోటల్ రూమ్లో ఉండటం లేదు. అందువల్ల మిగతా ప్లేయర్స్పై దీని ప్రభావం లేదు. అయితే ఆ ప్లేయర్ పేరు మాత్రం చెప్పలేను అని పీటీఐతో శుక్లా చెప్పారు.
ఇప్పటి వరకూ మరే ఇతర ప్లేయర్ కూడా పాజిటివ్గా తేలలేదు. కరోనా ప్రొటోకాల్ పాటించాలని ఇప్పటికే బోర్డు సెక్రటరీ జే షా ప్లేయర్స్కు మెయిల్ పంపారు అని శుక్లా వెల్లడించారు. అయితే ఆ ప్లేయర్ పంతే అని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు పీటీఐ తెలిపింది. పంత్కు డెల్టా వేరియంటే సోకింది. ఈ వేరియంటే ఇండియాలో సెకండ్ వేవ్కు కారణమైన విషయం తెలిసిందే.