లండన్: వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ తర్వాత ఇండియన్ ప్లేయర్స్ మూడు వారాల హాలిడేను ఎంజాయ్ చేయబోతున్నట్లు వార్తలు రాగానే చాలా మంది ఆందోళన వ్యక్తం చేశారు. ప్లేయర్స్ ఎక్కడ కరోనా బారిన పడతారో అని టెన్షన్ పడ్డారు. మొత్తానికి రిషబ్ పంత్కు ఈ మహమ్మారి సోకింది. మరో ఇద్దరు ప్లేయర్స్ కూడా ఐసోలేషన్లో ఉన్నారు. అయితే పంత్కు కరోనా ఎలా సోకిందన్నది తేల్చడం అంత సులువు కాదు. ఈ మూడు వారాల వ్యవధిలో అతడు యూరో కప్ మ్యాచ్ చూడటంతోపాటు ఇతర చోట్ల కూడా తిరిగాడు. కానీ అతడు ఓ డెంటిస్ట్ దగ్గరకు వెళ్లడం వల్లే కరోనా సోకినట్లు అనుమానిస్తున్నారు.
పంత్కు ఈ నెల 8న పాజిటివ్గా తేలింది. అంతకు రెండు రోజుల ముందు అంటే జులై 5, 6 తేదీల్లో పంత్ ఓ డెంటిస్ట్ దగ్గరకు వెళ్లాడు. ఆ క్లినిక్లోనే అతనికి వైరస్ సోకి ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా తన రిపోర్ట్లో వెల్లడించింది. అంతకుముందు జూన్ 29న పంత్ లండన్లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్, జర్మనీ ఫుట్బాల్ మ్యాచ్ చూశాడు. అయితే కరోనా పాజిటివ్గా తేలిన సమయం, డెంటిస్ట్ దగ్గరకు వెళ్లిన సమయం చూస్తుంటే అతనికి కరోనా రావడానికి ఇదే కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.