ముంబై: ఇండియన్ టీమ్ కోచ్ పదవి కోసం చాలా మంది ఎగబడతారు. అందులోనూ విదేశీ కోచ్లు మరింత ఆసక్తి చూపిస్తారు. ఈ పోస్ట్ ఖాళీ అయిన ప్రతిసారి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించగానే పెద్ద ఎత్తున విదేశీ మాజీలు అప్లై చేసుకుంటారు. కానీ ఈసారి మాత్రం మన బోర్డే ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ దగ్గరకు ఈ ప్రతిపాదనతో వెళ్లిందని, అయితే అతడు మాత్రం నిరాకరించాడని టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. కోచ్ పదవి వద్దనడానికి కారణమేంటో మాత్రం చెప్పలేదు. పాంటింగ్ ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్కు కోచ్గా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కోచ్ పదవి కోసం రాహుల్ ద్రవిడ్ దాదాపు ఖాయమైన విషయం తెలిసిందే. అయితే అంతకుముందే ఒకసారి ద్రవిడ్ను అడిగితే అతడు సున్నితంగా తిరస్కరించాడు. అటు కుంబ్లే కూడా ఆసక్తి చూపలేదు.
దీంతో బీసీసీఐ పాంటింగ్తోపాటు జయవర్దనెలాంటి విదేశీ ప్లేయర్స్ వైపు చూసింది. కానీ ఆ ఇద్దరూ నో చెప్పడంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ ద్రవిడ్నే దీనికోసం ఒప్పించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ద్రవిడే కరెక్ట్ చాయిస్. నిజం చెప్పాలంటే మాకు వేరే అవకాశం లేదు అని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. ఇప్పుడు ద్రవిడ్కు ఇస్తున్న జీతానికి నేషనల్ క్రికెట్ అకాడమీ చీఫ్గా పని చేయలేడని, టీమిండియా కోచ్ పదవి తీసుకోవడం మాత్రమే ద్రవిడ్ ముందున్న అవకాశమని కూడా ఆ అధికారి చెప్పడం గమనార్హం.