న్యూఢిల్లీ: ఇంగ్లండ్ గడ్డపై సుదీర్ఘ ఫార్మాట్లో సత్తాచాటుతున్న భారత జట్టు.. రానున్న టీ20 ప్రపంచకప్పై కూడా దృష్టి సారించినట్లు కనిపిస్తున్నది. వరల్డ్కప్నకు ముందు టీమ్ఇండియా ఆడాల్సిన పరిమిత ఓవర్ల సిరీస్లు లేకపోగా.. యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్ రెండో దశ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ క్రమంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీతో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భేటీ అయ్యాడు. బోర్డు కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో టీ20 వరల్డ్కప్ గురించి చర్చ జరిగినట్లు సమాచారం. ‘అవును, బీసీసీఐ పెద్దలు కోహ్లీతో సమావేశమయ్యారు. ప్రపంచకప్నకు చాలా తక్కువ సమయం ఉండటంతో దానికి సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి చర్చించుకొని ఉంటారు’ అని ఓ అధికారి తెలిపారు.