సిడ్నీ: మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ కృషి వల్లే టీమ్ఇండియా ఈ స్థాయికి చేరుకుందని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు గ్రెగ్ చాపెల్ అన్నాడు. యువ క్రికెటర్లకు తర్ఫీదునిచ్చే విషయంలో ఆస్ట్రేలియా గతంలో అవలంభించిన పద్ధతులను అవపోసన పట్టిన ద్రవిడ్..భారత్లో మార్పులకు నాంది పలికాడని చాపెల్ చెప్పుకొచ్చాడు. పటిష్టమైన దేశవాళీ టోర్నీల ద్వారా మెరికల్లాంటి క్రికెటర్లను గుర్తించి జాతీయ జట్టుకు అందించడంలో ద్రవిడ్ కృషి ఎనలేనిదని అన్నాడు. ఈ క్రమంలో ఆసీస్ను అధిగమిస్తూ భారత్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ రీతిలో రాణించడానికి కారణమైందని పేర్కొన్నాడు. బుధవారం చాపెల్ మాట్లాడుతూ ‘గతంలో మేము అమలు చేసిన విధానాలను ద్రవిడ్ క్షుణ్ణంగా పరిశీలించాడు. క్షేత్రస్థాయి నుంచి క్రికెటర్లకు ఎలాంటి శిక్షణ, సదుపాయాలు, టోర్నీలు ఆడించే విషయాలపై పట్టు సాధించాడు. గత కొన్నేండ్లుగా వాటిని భారత్లో అమలు చేస్తుండటం వల్లే టీమ్ఇండియా అనితర సాధ్యమైన విజయాలు సాధిస్తున్నది. ద్వితీయ శ్రేణి జట్టుతో ఆసీస్పై టీమ్ఇండియా టెస్టు సిరీస్ విజయం సాధించడమే దీనికి సరైన ఉదాహరణ’ అని అన్నాడు. గత విధానాలను అమలు చేయడంలో ఆసీస్ విఫలమవుతుంటే..ఈ విషయంలో భారత్, ఇంగ్లండ్ ముందంజలో ఉన్నాయని చాపెల్ అభిప్రాయపడ్డాడు.