పొట్టి పోరుకు రెడీ

- భారత్, ఆస్ట్రేలియా తొలి టీ20 నేడు
- గెలువాలన్న కసితో కోహ్లీసేన..
- సత్తాచాటేందుకు కంగారూల తహతహ
చివరి వన్డేలో గెలిచిన ఉత్సాహం.. జట్టులో పెరిగిన సమతూకాన్ని కూడగట్టుకొని ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలనే పట్టుదలతో టీమ్ఇండియా టీ20 సిరీస్లో అడుగుపెట్టనుంది. వన్డే సిరీస్లో ఎదురైన పరాభవానికి తగిన జవాబునివ్వాలని కోహ్లీసేన తహతహలాడుతున్నది. మరోవైపు సూపర్ ఫామ్లో ఉన్న ఆతిథ్య ఆసీస్ తమకు అచ్చొచ్చిన పొట్టి క్రికెట్లోనూ సత్తాచాటాలనిపట్టుదలతో ఉంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో ఉన్న ఆసీస్, మూడులో ఉన్న భారత్ మధ్య టీ20 సిరీస్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తున్నది.
కాన్బెర్రా: ఆతిథ్య ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్ సమరానికి టీమ్ఇండియా రెడీ అయింది. 1-2తో వన్డే సిరీస్ కోల్పోయినా చివరి మ్యాచ్ గెలుపుతో కోహ్లీసేన ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది. మూడు టీ20ల సిరీస్లో భాగంగా శుక్రవారం ఇక్కడి మనూకా ఓవల్ మైదానం వేదికగా జరిగే తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. వన్డే జట్టుతో పోలిస్తే టీ20 ఫార్మాట్లో టీమ్ఇండియా మంచి సమతూకంతో ఉంది. ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన చేసిన ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ జట్టులోకి రావడం, రవీంద్ర జడేజా కూడా ఫామ్ అందుకోవడంతో భారత్కు ఆల్రౌండర్ల కొరత తీరినట్టే కనిపిస్తున్నది. దీంతో హార్దిక్ పాండ్య బంతి అందుకోకున్నా బౌలింగ్ వనరులు సరిపడా ఉన్నాయి. మరోవైపు ఐపీఎల్లో బీభత్సం సృష్టించిన కేఎల్ రాహుల్ తనకు అచ్చొచ్చిన ఓపెనింగ్కు ధవన్తో కలిసి రానున్నాడు. శ్రేయస్ సైతం రాణిస్తే తిరుగుండదు. మూడో వన్డేలో ఆకట్టుకున్న యార్కర్ స్పెషలిస్ట్ నటరాజన్ టీ20 అరంగేట్రం కూడా ఈ మ్యాచ్తో ఖాయంగా కనిపిస్తున్నది. బుమ్రాకు నటరాజన్ తోడైతే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ను చివరి ఓవర్లలో కట్టడి చేయొచ్చని కెప్టెన్ విరాట్ కోహ్లీ భావిస్తున్నాడు. కరోనా వైరస్ మహమ్మారి రాక ముందు ఈ ఏడాది జనవరి-ఫిబ్రవరిలో న్యూజిలాండ్ గడ్డపై జరిగిన టీ20 సిరీస్ను 5-0తో నెగ్గడం కూడా కోహ్లీసేనకు మానసికంగా సానుకూలాంశం. మరోవైపు ఐపీఎల్లో ఆడడం ద్వారా ఇరు జట్లకు సరిపడా టీ20 ప్రాక్టీస్ ఉంది.
ఓపెనింగ్ ఎవరు..?
గాయంతో స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ దూరమవడంతో అతడి స్థానంలో కెప్టెన్ ఫించ్తో కలిసి ఓపెనింగ్ చేసేదెవరనే ప్రశ్న ఆస్ట్రేలియా జట్టులో మిగిలిపోయింది. ఆల్రౌండర్ స్టొయినిస్ ఆ స్థానానికి తగ్గవాడే అయినా స్వల్ప గాయంతో అతడు ఈ మ్యాచ్ ఆడడం అనుమానంగా మారింది. దీంతో ఓపెనింగ్కు వేడ్ను పంపాలా.. ప్రత్యామ్నాయం ఆలోచించాలా అన్న సందిగ్ధంలో ఆసీస్ మేనేజ్మెంట్ ఉంది. కాగా ఐపీఎల్లో విఫలమైన ఫించ్, స్మిత్, మ్యాక్స్వెల్ వన్డే సిరీస్లో భీకర ఫామ్ కనబరిచారు. వీరిని కట్టడి చేసి టీ20 సిరీస్లో శుభారంభం చేయాలని కోహ్లీసేన పట్టుదలగా ఉంది. మరోవైపు బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండడం ఆసీస్కు పెద్ద బలం.
భారత్ సానుకూలతలు
- వాషింగ్టన్ సుందర్ రాకతో ఆల్రౌండర్ లోటు తీరడం
- హార్దిక్ పాండ్యా నిలకడైన ప్రదర్శన
- చివరి వన్డేతో జడేజా, బుమ్రా ఫామ్లోకి రావడం
- బుమ్రాకు నటరాజన్ తోడైతే బలోపేతమైన డెప్త్ బౌలింగ్
- టీ20ల్లో కేఎల్ రాహుల్ ప్రదర్శన
- గత న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ను 5-0తో క్లీన్స్వీప్ చేయడం
భారత్ ప్రతికూలతలు
- శ్రేయస్ సహా మిడిలార్డర్ బ్యాట్స్మెన్ ఫామ్లో లేకపోవడం
- ఆస్ట్రేలియాపై ఒక్క టీ20 ద్వైపాక్షిక సిరీస్ కూడా గెలువలేకపోవడం
ఆసీస్ సానుకూలతలు
- వన్డేల్లో ఫించ్, స్మిత్, మ్యాక్స్వెల్ అదరగొట్టడం
- బౌలర్లు సమిష్టిగా రాణిస్తుండడం
- భారత్పై గత టీ20 సిరీస్ను 2-0తో గెలువడం
ఆసీస్ ప్రతికూలతలు
- గాయం వల్ల వార్నర్ దూరమవడంతో ఓపెనర్ స్థానంపై సందిగ్ధత
- కమిన్స్కు విశ్రాంతి, స్టొయినిస్ ఆడడంపై అనుమానం
- ఇంగ్లండ్పై గత పొట్టి సిరీస్లో ఓడి రెండో ర్యాంకుకు పడిపోవడం
జట్లు (అంచనా)
భారత్: ధవన్, రాహుల్, కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్, మనీశ్ పాండే, హార్దిక్, జడేజా, చాహర్, నటరాజన్, బుమ్రా, చాహల్/కుల్దీప్
ఆస్ట్రేలియా: ఫించ్(కెప్టెన్), మాథ్యూ వేడ్, స్మిత్, మ్యాక్స్వెల్, హెన్రిక్స్, క్యారీ, ఆస్టన్ అగర్, అబాట్, ఆండ్రూ టై/స్టార్క్, జంపా, హేజిల్వుడ్
పిచ్ - వాతావరణం
మనూకా ఓవల్ మైదానం బ్యాటింగ్తో పాటు బౌలర్లకు కూడా కాస్త అనుకూలించే అవకాశం ఉంది. ఇక్కడ జరిగిన బిగ్బాష్ మ్యాచ్ల్లో మంచి స్కోర్లు నమోదయ్యాయి. ఒకే ఒక్క అంతర్జాతీయ టీ20లో పాక్పై ఆస్ట్రేలియా గెలిచింది. వాతావరణం పొడిగా ఉంటుంది.
తాజావార్తలు
- సంతోష్ బాబు పోరాటం.. సమాజానికి స్ఫూర్తిదాయకం
- కాంట్రాక్టు అధ్యాపకులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
- వారానికి 4 రోజులే.. కరోనా టీకా
- సిటిజన్ కాప్స్
- ప్రయాణం ఏదైనా కార్డు ఒక్కటే..
- వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి
- మహేశ్వరం మండలానికి నాలుగులేన్ల రోడ్డు
- బాధిత కుటుంబాలకు భరోసా..
- సీబీఎస్లో సౌకర్యవంతంగా...
- దోమలపై ఎంటమాలజీ యుద్ధం