వివరాలు సక్రమంగా తెలియజేయాలి
కలెక్టర్ వెంకట్రావు
భూత్పూర్లో ఇంటింటి సర్వే పరిశీలన
భూత్పూర్, మే 11: వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట..ప్రభుత్వం అన్ని కోణాల్లో ఆలోచించి పది రోజుల పాటు లాక్డౌన్ విధించింది. దీంతో వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతుంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు అన్ని వ్యాపారాలు నడుస్తాయి. ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ ఉంటుంది. వైరస్ విస్తృతంగా వ్యాపించిన తరుణంలో చాలా కఠిన నిబంధనలు ఉంటాయి. ప్రజలు ఇంటికే పరిమితం కావాలి. మినహాయింపు వేళల్లో అత్యవసరమైతేనే బయటకు రావడం ఉత్తమం. లాక్డౌన్ సమయంలోనూ అత్యవసర సేవలు 24 గంటల పాటు అందుబాటులో ఉంటాయి. దవాఖానలు, మెడికల్ షాపులు తెరిచే ఉంటాయి. వైరస్ చైన్ కట్ అయ్యేందుకు లాక్డౌన్ ఉపయోగపడుతుంది. ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించాలి.
కలెక్టర్ వెంకట్రావు
గ్రామాల్లో ఇంటింటికీ వచ్చే ఫీవర్ సర్వే బృందానికి సహకరించాలని కలెక్టర్ వెంకట్రావు కోరారు. మంగళవారం ఆయన భూత్పూర్ మున్సిపాలిటీలోని 7వ వార్డు రాజీవ్ స్వగృహలో ఆకస్మికంగా సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కొన్ని కుటుంబాల సభ్యులతో మీ ఇంటికి సర్వే బృందం సభ్యులు వచ్చారా? అని అడిగారు. వచ్చారని చెప్పారు. ఇంటింటికీ వచ్చిన సర్వే బృందానికి సహకరిస్తూ వివరాలను సక్రమంగా తెలియజేయాలని కలెక్టర్ కోరారు. జ్వరం, దగ్గు, జలుబు, ఒంటినొప్పులతోపాటు మరేదైనా లక్షణాలు ఉంటే చెప్పాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 720 వైద్య బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా 2,16,053 గృహాలను పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు. 7,155 మంది జ్వరం, దగ్గుతో బాధపడుతున్నట్లు చెప్పారు. వీరందరికీ హెల్త్ కిట్లు పంపిణీ చేసినట్లు వివరించారు. కరోనాకు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నట్లు సూచించారు. కిట్లు, వైద్యులను కూడా నియమించనున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి కృష్ణ, తాసిల్దార్ చెన్నకిష్టన్న, మున్సిపల్ వైస్ చైర్మన్ కెంద్యాల శ్రీనివాస్, కమిషనర్ నూరుల్నజీబ్, నాయబ్ తాసిల్దార్ రాజీవ్రెడ్డి, సూపర్వైజర్ యాదమ్మ, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.