ఢిల్లీ: ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ అదరగొట్టారు. డుప్లెసిస్(50: 28 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు), మొయిన్ అలీ(58: 36 బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లు), అంబటి రాయుడు(72 నాటౌట్: 27 బంతుల్లో 4ఫోర్లు, 7సిక్సర్లు ) మెరుపు అర్ధశతకాలతో చెలరేగారు. ముంబై బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ బ్యాట్స్మెన్ సమిష్టిగా రాణించడంతో చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 218 పరుగులు చేసింది. చివర్లో రాయుడు వీరవిహారం చేశాడు. ఆఖరి ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించి జట్టు స్కోరును అలవోకగా 200 దాటించాడు.
ముంబై బౌలర్లలో పొలార్డ్ ఒక్కడే రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, బుమ్రా చెరో వికెట్ తీశారు. చెన్నై బ్యాట్స్మెన్ను కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన చెన్నై..చివర్లో ముంబై బౌలర్లకు రాయుడు చుక్కలు చూపించాడు. రాయుడు విధ్వంసం సృష్టించడంతో చెన్నై అనూహ్యంగా 200పైగా స్కోరు సాధించింది. రవీంద్ర జడేజా(22 నాటౌట్: 22 బంతుల్లో 2ఫోర్లు) చివర్లో రాయుడుకు మంచి సహకారం అందించాడు.