హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): వ్యవసాయంలో డ్రోన్ల వినియోగంపై గ్రామీణ యువతకు, రైతులకు శిక్షణ ఇవ్వాలని జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆసియా పసిఫిక్ ఫ్లైట్ ట్రైనింగ్ అకాడమీ, మారుత్ డ్రోన్టెక్ సంస్థలతో శుక్రవారం ఒప్పందం కుదుర్చుకొన్నది. వర్సిటీ వీసీ ప్రవీణ్రావు సమక్షంలో రిజిస్ట్రార్ సుధీర్కుమార్, సంస్థల ప్రతినిధులు హేమంత్ దండపాణి, ప్రేమ్కుమార్ ఒప్పందపత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రవీణ్రావు మాట్లాడుతూ ఇప్పటికే వ్యవసాయంలో డ్రోన్ల ప్రయోగానికి డీజీసీఏ అనుమతి ఇచ్చినట్టు తెలిపారు. డ్రోన్ల వినియోగంలో యువతకు శిక్షణకార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. త్వరలోనే సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. వర్సిటీ ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు. డ్రోన్ల వినియోగంతో రైతులకు పెట్టుబడి ఖర్చు భారీగా తగ్గే అవకాశం ఉంటుందని వీసీ అభిప్రాయపడ్డారు.