లండన్: ఇండియన్ టీమ్ ( Team India ) కోచింగ్ సిబ్బంది మొత్తం త్వరలోనే మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. హెడ్ కోచ్ రవిశాస్త్రితోపాటు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తమ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్ల పదవీ కాలం ఈ ఏడాది జరగబోయే టీ20 వరల్డ్కప్తో ముగియనుంది. ఆ తర్వాత ఇక టీమిండియాతో కొనసాగబోనని ఇప్పటికే రవిశాస్త్రి బీసీసీఐలోని కొందరు సభ్యులకు చెప్పినట్లు సమాచారం. మరోవైపు మిగతా కోచ్లు కూడా ఇప్పటికే ఐపీఎల్ టీమ్స్తో ఒప్పందాల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
రవిశాస్త్రి కోచ్గా ఉన్న సమయంలో టీమిండియా చెప్పుకోవదగిన విజయాలే సాధించినా.. బీసీసీఐ మాత్రం ఓ కొత్త కోచింగ్ టీమ్ను తీసుకురావాలని భావిస్తున్నట్లు బోర్డు వర్గాలు వెల్లడించాయి. 2014లో టీమ్ డైరెక్టర్గా తొలిసారి బాధ్యతలు స్వీకరించిన రవిశాస్త్రి.. మధ్యలో అనిల్ కుంబ్లే కోచ్గా ఉన్న ఏడాది పాటు టీమ్కు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత 2017లో మరోసారి కోచ్గా వచ్చాడు. అప్పటి నుంచీ ఇండియా స్వదేశంతోపాటు విదేశీ పర్యటనల్లోనూ మంచి విజయాలు సాధించింది. ఐసీసీ టోర్నీ గెలవలేదన్న నిరాశ తప్ప.. కోచ్గా రవిశాస్త్రి మంచి సక్సెసే సాధించాడు.
అతని తర్వాత టీమిండియా కోచ్ రేసులో ఉన్న వాళ్లలో మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ ముందు వరుసలో ఉన్నాడు. ఇప్పటికే అతడు నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా, ఇండియా ఎ, అండర్ 19 టీమ్ కోచ్గా సక్సెసయ్యాడు. ఈ మధ్య శ్రీలంక వెళ్లిన మరో టీమిండియాకు కూడా కోచ్గా వ్యవహరించాడు. ఒకవేళ రవిశాస్త్రి తప్పుకుంటే ఆ పదవిని ద్రవిడ్కే ఇవ్వాలని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు కూడా సలహా ఇచ్చారు. సెప్టెంబర్తో ఎన్సీఏలో ద్రవిడ్ కాంట్రాక్ట్ ముగుస్తోంది.