హైదరాబాద్ : తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వ్యక్తులందరికీ కొవిడ్ టీకాలు వేయాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. దీని ప్రకారం 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి ప్రభుత్వ వ్యాక్సినేషన్ కేంద్రాల్లో గురువారం నుంచి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ పొందేందుకు అర్బన్ లోకల్ బాడీస్, జీహెచ్ఎంసీ పరిధిలో కొవిన్ యాప్ ద్వారా పౌరులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో నేరుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చు. మరోవైపు హై రిస్క్ ఉన్న గ్రూప్లకు టీకాలు వేసే కార్యక్రమం కొనసాగుతూనే ఉంది.
రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన 1.5 కోట్లకు పైగా వ్యక్తులకు కొవిడ్ వ్యాక్సిన్లను అందించే కార్యక్రమానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆరోగ్యశాఖ జీహెచ్ఎంసీ పరిధిలో 100 జీసీవీసీ లను, అర్బన్ లోకల్ బాడీల్లో 204 జీసీవీసీలను, గ్రామీణ ప్రాంతాల్లోని 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అర్హత ఉన్నవారికి టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లబ్ధిదారులందరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ జి.శ్రీనివాస్ రావు కోరారు.