టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా విజయంపై సంబురాలు
నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం
మంత్రి అజయ్, నేతలకు సీఎం కేసీఆర్ అభినందనలు
ఇదే స్ఫూర్తితో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికలకు..
ఖమ్మం, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయభేరి మోగించింది.. ఖమ్మం- వరంగల్- నల్లగొండ ఖిల్లాలపై గులాబీ జెండా రెపరెపలాడింది.. పట్టభద్రులు పల్లా రాజేశ్వర్రెడ్డికే పట్టంగట్టారు.. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తెలంగాణ ప్రభుత్వానికే మద్దతునిచ్చారు.. శనివారం రాత్రి ప్రకటించిన ఎన్నికల తుది ఫలితాల్లో పార్టీ విజయాన్ని సాధించడంతో ఉమ్మడి జిల్లాలో సంబురాలు మిన్నంటాయి.. ఈ గెలుపు పార్టీ శ్రేణుల్లో నయా జోష్ నింపింది.. పల్లా గెలుపునకు కృషి చేసిన మంత్రి అజయ్కి, పార్టీ నేతలకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు.. పార్టీ నాయకులు ఇదే స్ఫూర్తితో ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు..
నల్లగొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా ఘన విజయం సాధించారు.. నాలుగురోజుల పాటు జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉత్కంఠభరితంగా సాగగా చివరికి పల్లాను విజయం వరించింది. ఆయన గెలుపుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సంబురాలు మిన్నంటాయి.. ఈ గెలుపు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ముందు నుంచే గెలుపు కోసం వ్యూహాలు రచించారు. టీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధుల నాయకత్వంలో సన్నాహక సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను తిప్పికొట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఓటుహక్కు కలిగిన పట్టభద్రులను చైతన్య పరిచారు. ఇవన్నీ పల్లా గెలుపునకు కారణమయ్యాయి.
ఎన్నిక ఏదైనా గులాబీదే గెలుపు..
రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించిన లోక్సభ, పంచాయతీ, ప్రాదేశిక, సహకార సంఘం, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో టీఆర్ఎస్సే సత్తా చాటింది. రెండు జిల్లాల జడ్పీ చైర్మన్ పదవులను, వైస్ చైర్మన్ పదవులను కైవసం చేసుకున్నది. ఉమ్మడి జిల్లాలో పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇదే స్ఫూర్తితో పార్టీ శ్రేణులు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు నడుం బిగించాయి. ఓటర్ల నమోదు నుంచి పోలింగ్ జరిగే తేదీ వరకు పార్టీ నాయకులు అహర్నిశలు శ్రమించి పల్లా గెలుపునకు కృషి చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ప్రచారాన్ని పకడ్బందీగా నిర్వహించడంతో పాటు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో ఖమ్మంలో పట్టభద్రులతో నిర్వహించిన సభ విజయవంతమైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆ సభలో పల్లా రాజేశ్వర్రెడ్డికి మద్దతు ప్రకటించాయి. అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులు నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలు, ఆత్మీయ సభలు విజయవంతం కావడంతో పాటు పల్లా విజయానికి ఢోకా లేదన్న భావన పార్టీ శ్రేణుల్లో కలిగింది. నాలుగు రోజుల పాటు నల్గొండలో జరిగిన ఓట్ల లెక్కింపు అనుక్షణం ఉత్కంఠను రేపింది. పల్లా విజయంతో ఉమ్మడి జిల్లా పార్టీ శ్రేణులు శ్రమకు తగిన ఫలితం లభించిందన్న సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. త్వరలో జరుగనున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లోనూ సత్తా చాటేందుకు మంత్రి పువ్వాడ అజయ్కుమార్ నేతృత్వంలో నేతలు కసరత్తు చేస్తున్నారు. డివిజన్ల వారీగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మంత్రి అజయ్కి సీఎం కేసీఆర్ అభినందనలు
టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి విజయానికి కృషి చేసిన మంత్రి అజయ్కుమార్తో పాటు ఉమ్మడి జిల్లా నేతలు, కార్యకర్తలకు సీఎం కేసీఆర్ అభినందనలు తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ప్రచారం నిర్వహించి, ఇంటింటికీ ప్రభుత్వ పథకాలను వివరించి తన విజయానికి దోహదపడిన పార్టీ నేతలు, కార్యకర్తలకు పల్లా కృతజ్ఞతలు తెలిపారు. ఓటు వేసి గెలిపించిన పట్టభద్రులు, ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు.