రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు
ఉక్కపోతతో అల్లాడుతున్న జనం
బిజినేపల్లి, ఏప్రిల్ 1 : భానుడు భగభగ మండుతున్నాడు. వేసవి ఆరంభంలోనే ఎండ తీవ్రతకు ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మధ్యాహ్న సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు కొబ్బరి బొండాలు, శీతల పానీయాలను సేవిస్తున్నారు.. వేసవి దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. ఇప్పుడే 41 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రత నమోదవుతున్నది. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళలో బయటకు రావడానికి జంకుతున్నారు. వడదెబ్బ సోకే ప్రమాదాలు చాలా ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రత ఉన్న సమయంలో డీహైడ్రేషన్కు గురైనప్పుడు చర్మం, ఊపిరితిత్తులు సరిగ్గా పని చేయకపోవడంతో వడదెబ్బకు గురవుతుంటాం. సాధారణంగా వడదెబ్బకు రెండేండ్లలోపు చిన్నారులు, 60 ఏండ్లు పైబడినవారు, ఎండలో పనిచేసే వారు ఎక్కువగా గురవుతుంటారు. ఈ క్రమంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలను కాపాడుకోవచ్చు.
వడదెబ్బ లక్షణాలు..
అధిక శరీర ఉష్ణోగ్రత, శరీరం పొడిబారడం, దప్పిక ఎక్కువ అవ్వడం.
వాంతులు అవ్వడం, నీరసంగా ఉండడం.
ఆయాసం, గుండె వేగంగా కొట్టుకోవడం.
చిరాకు వేయడం, ఎక్కడ ఉన్నామో తెలియకపోవడం.
భ్రమతో కూడుకున్న ఆలోచన కలగడం.
స్పృహ కోల్పోవడం జరుగుతుంది.
చికిత్స..
వడదెబ్బకు గురైన వెంటనే చికిత్స చేయాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. కొద్దిపాటి జాగ్రత్తలతో ప్రథమ చికిత్స చేయాలి.
మొదటగా వడదెబ్బకు గురైన వ్యక్తి శరీరాన్ని చల్లటి నీటితో తుడవాలి.
చల్లటి నీటిలో తడిపిన వస్ర్తాలను కప్పాలి.
వెంటనే దగ్గర్లోని దవాఖానకు తీసుకెళ్లాలి.
నివారణ మార్గాలు..
తారచూ చల్లటి నీరు తాగాలి.
బయట పనిచేసే వారు అప్పుడప్పుడు విరామం తీసుకోవాలి.
సాధ్యమైనంత వరకు మిట్ట మధ్యాహ్నం ఎండలో తిరగకూడదు.
వేసవిలో చల్లని వదులైన కాటన్ దుస్తులు ధరించాలి
గదుల ఉష్ణోగ్రత తగ్గించేలా చర్యలు తీసుకోవాలి.
వేసవిలో జాగ్రత్తగా ఉండాలి..
వేసవిలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం రోజురోజుకూ ఎండలు విపరీతంగా పెరుగుతున్నాయి. అందుకని బయట తిరగకుండా ఉండాలి. నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. వడదెబ్బకు గురైన వెంటనే దగ్గరలో ఉన్న దవాఖానకు వెళ్లాలి. చికిత్స తీసుకోకుంటే ప్రాణానికే ప్రమాదం. ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగాలి.