మన్సూరాబాద్, ఏప్రిల్ 19: రాబోయే వర్షా కాలంలో కాలనీల్లో డ్రైనేజీ ముంపు సమస్యలు తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మన్సూరాబాద్ డివిజన్ పరిధి శైలజాపురికాలనీలో రూ. 33 లక్షలతో ఇటీవల ప్రారంభించిన డ్రైనేజీ ట్రంక్లైన్ పనులను సోమవారం ఆయన కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలంతో సంబంధంలేకుండా ప్రతినిత్యం శైలజాపురికాలనీలో డ్రైనేజీ సమస్య తలెత్తుతుందని తెలిపారు. నాలుగేండ్లుగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న మురుగునీటి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రూ. 33 లక్షలతో పనులు ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రణాళికాబద్ధంగా నూతన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.