ముంబై: ఐపీఎల్ 14వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. వాంఖడే స్టేడియంలో సంజూ శాంసన్ కెప్టెన్సీలోని రాజస్థాన్ రాయల్స్, కేఎల్ రాహుల్ నాయకత్వంలోని పంజాబ్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ బౌలింగ్ ఎంచుకున్నాడు.
గత 12 సీజన్ల పాటు పంజాబ్ కింగ్స్ ఎలెవన్గా ఉన్నా టైటిల్ నెగ్గని ఈ జట్టు పంజాబ్ కింగ్స్ పేరుతో ఐపీఎల్ 2021లో ఆడుతోంది. మరోవైపు రాజస్థాన్ కూడా ఈ సీజన్లో కొత్తగా బరిలో దిగుతోంది.
యువ కెప్టెన్ సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ ఏమేరకు రాణిస్తుందో చూడాలి. గతేడాది పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలవడంతో సారథితో పాటు కోచింగ్ స్టాఫ్లో కూడా ఫ్రాంఛైజీ భారీ మార్పులు చేసింది. ఇంగ్లీష్ స్టార్ ప్లేయర్లు జోస్ బట్లర్, బెన్స్టోక్స్పైనే జట్టు ఎక్కువగా నమ్మకం పెట్టుకుంది. స్టార్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ దూరమవడం పెద్ద ఎదురుదెబ్బే.
మరోవైపు బౌలింగ్ విభాగంలో కొత్తగా జట్టులోకి వచ్చిన జే రిచర్డ్సన్పైనే పంజాబ్ ఆశలు పెట్టుకుంది. 14 కోట్లకు అమ్ముడుపోయిన రిచర్డ్సన్ తనకు చెల్లిస్తున్న మొత్తానికి న్యాయం చేయాలనే ఒత్తిడిలో ఉన్నాడు. ఇటీవలే కోలుకున్న పేసర్ మహ్మద్ షమి అంచనాలను అందుకుంటాడో లేదో చూడాలి. హార్డ్హిట్టర్ క్రిస్గేల్ చెలరేగితే ఆ జట్టుకు తిరుగుండదు.