హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పట్టాలెక్కుతున్నది. కరోనా సెకండ్ వేవ్ మధ్య లాక్డౌన్ సమయంలో కొనుగోళ్లు, అమ్మకాలు స్తంభించినా.. ఆంక్షలు ఎత్తివేయగానే క్రయవిక్రయాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. మొదటి వేవ్తో పోల్చితే ఈసారి పెద్దగా నష్టం జరుగలేదన్నది మార్కెట్ వర్గాల మాట. సాధారణంగా ఏటా ఏప్రిల్, మే, జూన్ నెలల్లో తల్లిదండ్రులు తమ సేవింగ్స్ను పిల్లల చదువుల కోసం ఖర్చు చేస్తుంటారు. దీంతో ఈ మూడు నెలలపాటు ఇండ్లు, ప్లాట్ల కొనుగోళ్లు కాస్త మందగిస్తుంటాయి. జూలై చివరి వారం లేదా ఆగస్ట్ మొదటివారం నుంచి మళ్లీ కొనుగోళ్ల వేగం పెరుగుతుంది. ఈసారి కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇండిపెండెంట్ హౌజ్లకు గిరాకీ
కరోనా నేపథ్యంలో కొనుగోలుదారుల ఆలోచనా విధానం కూడా మారింది. ఇంతకుముందు అపార్ట్మెంట్లలో అయితే అందరితో కలిసి ఉండవచ్చనే భావన ఉండేది. ఇప్పుడు వ్యక్తిగత ఇండ్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు. మొదటివేవ్ తర్వాతి నుంచి ఇప్పటివరకు చూస్తే ఇండిపెండెంట్ హౌజ్లు, విల్లాల అమ్మకం 10-20 శాతం పెరిగినట్టు మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. అంతేకాదు.. అవసరమైతే నగరానికి, కాలుష్యానికి దూరంగా, పచ్చని ప్రకృతి మధ్య జీవించాలని చాలా మంది భావిస్తున్నారు. దీంతో ఔటర్లో మార్కెట్ క్రమంగా పెరుగుతున్నది.
కలిసొచ్చిన ప్రభుత్వ పాలసీలు
కరోనా మొదటి వేవ్ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తిరిగి పుంజుకోవడానికి, సెకండ్ వేవ్ను సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రభుత్వ పాలసీలు బాగా కలిసొచ్చాయి. ఐటీతోపాటు తయారీ, ఔషధ రంగాలను ప్రోత్సహిస్తుండటంతో తెలంగాణలో తప్పక ఉపాధి దొరుకుతుందన్న భావన అందరిలో నెలకొన్నది. ఇది నిర్మాణ రంగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతున్నది.
భూములపై పెరిగిన పెట్టుబడి
కాళేశ్వరం, ఇతర ప్రాజెక్టుల ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పెరిగింది. రైతుబంధు, ధాన్యం విక్రయాల ద్వారా రైతు చేతికి డబ్బు వస్తున్నది. దీంతో భూములపై పెట్టుబడి పెట్టడానికి ముందుకొస్తున్నారు. కాగా, పారిశ్రామిక రంగంలో ప్రభుత్వ చర్యల ఫలితంగా రాబోయే 2-3 ఏండ్లలో ఉద్యోగాల కల్పన విపరీతంగా పెరుగనున్నది. ఫార్మాసిటి అందుబాటులోకి వస్తే హైదరాబాద్ రియల్టీ మరో స్థాయికి వెళ్లనున్నది.
‘రియల్ ఎస్టేట్ రంగాన్ని సెకండ్ వేవ్ ఇబ్బంది పెట్టినా.. మొదటి వేవ్ స్థాయిలో దెబ్బతీయలేదు. లాక్డౌన్ తర్వాత పరిస్థితులు వేగంగా చక్కబడుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ వినూత్న పాలసీల ఫలితంగా పెట్టుబడిదారుల్లో రాష్ట్రంపై ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు. దీంతో పెట్టుబడులు కొనసాగుతున్నాయి’
రాజశేఖర్ రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి