మ్యాచ్లో సింహభాగం ఆధిక్యంలో ఉన్న పంజాబ్కు ఆఖరి ఓవర్లో దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఓ సెంచరీ, మరో అర్ధసెంచరీ భాగస్వామ్యంతో సజావుగా విజయతీరాలకు చేరేలా కనిపించిన రాహుల్ సేనను.. పెద్దగా అనుభవం లేని ఓ కుర్రబౌలర్ ఖంగు తినిపించాడు. పంజాబ్ను చివరి ఓవర్లో 4 పరుగులు చేయకుండా అడ్డుకున్న కార్తీక్ త్యాగి రాజస్థాన్కు అద్భుత విజయాన్నందించాడు. అంతకుముందు యశస్వి జైస్వాల్, మహిపాల్ లోమ్రర్ మెరుపులతో రాజస్థాన్ మంచి స్కోరు చేస్తే.. పంజాబ్ లెఫ్టార్మ్ పేసర్ అర్ష్దీప్ సింగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్ మెరుగైన ఆరంభాన్నిచ్చినా.. ఒక్క ఓవర్లో పంజాబ్ భవితవ్యం తారుమారైంది!
దుబాయ్: చివరి వరకు పట్టు వదలకుండా పోరాడితేనే ఓటమి కూడా విజయం అవుతుందని రాజస్థాన్ రాయల్స్ నిరూపించింది. మంగళవారం పంజాబ్ కింగ్స్తో జరిగిన పోరులో ఆశలు లేని స్థితి నుంచి అద్భుత విజయాన్నందుకుంది. చివరి ఓవర్లో నాలుగు పరుగులు చేయలేక చతికిలబడ్డ పంజాబ్ ఆఖరికి రెండు పరుగుల తేడాతో ఓటమి మూటగట్టుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (36 బంతుల్లో 49; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మహిపాల్ లోమ్రర్ (17 బంతుల్లో 43; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. లూయిస్ (36; 7 ఫోర్లు, 1 సిక్సర్), జైస్వాల్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడటంతో రాజస్థాన్ ఐదు ఓవర్లలోనే 53 పరుగులు చేసింది. లూయిస్ను ఔట్ చేయడం ద్వారా అర్ష్దీప్ పంజాబ్కు తొలి వికెట్ అందించగా.. ఆ తర్వాత లివింగ్స్టోన్ (25) సాయంతో జైస్వాల్ ఇన్నింగ్స్ను నడిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (4) విఫలం కాగా.. లోమ్రర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఎడాపెడా సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. స్కోరు రెండొందలు దాటడం ఖాయమే అనుకుంటున్న దశలో రియాన్ పరాగ్ (4), రాహుల్ తెవాటియా (2), క్రిస్ మోరిస్ (5)లను మహమ్మద్ షమీ బుట్టలో వేసుకొని రాజస్థాన్ను కట్టడి చేశాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 5, షమీ 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 183 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (67; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎల్ రాహుల్ (49; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించినా ఆఖర్లో ఒత్తిడిని జయించడంలో విఫలమైన పంజాబ్ పరాజయం వైపు నిలిచింది. ఆఖరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన కార్తీక్ త్యాగి (2/29)కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
టాపార్డర్ రాణించడంతో లక్ష్యఛేదనలో సజావుగా సాగిన పంజాబ్ ఆఖర్లో తడబడింది. 30 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన దశలో పూరన్, మార్కరమ్ చెలరేగడంతో లక్ష్యం 12 బంతుల్లో 8కి చేరింది. 19వ ఓవర్ వేసిన ముస్తఫిజుర్ 4 పరుగులే ఇవ్వడంతో ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ దశలో కార్తీక్ త్యాగి కట్టుదిట్టమైన బంతులతో చెలరేగి.. ఒక పరుగు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడంతో రాజస్థాన్ సంబురాల్లో మునిగిపోయింది. అప్పటి వరకు విజయం ఖాయం అనుకున్న పంజాబ్ శిబిరం నిర్వేదంలో మునిగిపోయింది.
రాజస్థాన్: లూయిస్ (సి) మయాంక్ (బి) అర్ష్దీప్ 36, జైస్వాల్ (సి) మయాంక్ (బి) హర్ప్రీత్ 49, శాంసన్ (సి) రాహుల్ (బి) పొరెల్ 4, లివింగ్స్టోన్ (సి) అలెన్ (బి) అర్శ్దీప్ 25, లోమ్రర్ (సి) మార్క్మ్ (బి) అర్శ్దీప్ 43, పరాగ్ (సి) మార్క్మ్ (బి) షమీ 4, తెవాటియా (బి) షమీ 2, మోరిస్ (సి) మార్క్మ్ (బి) షమీ 5, సకారియా (సి అండ్ బి) అర్శ్దీప్ 7, కార్తీక్ (బి) అర్శ్దీప్ 1, ముస్తఫిజుర్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 9, మొత్తం: 185. వికెట్ల పతనం: 1-54, 2-68, 3-116, 4-136, 5-166, 6-169, 7-175, 8-178, 9-185, 10-185, బౌలింగ్: షమీ 4-0-21-3, పొరెల్ 4-0-39-1, హుడా 2-0-37-0, అర్ష్దీప్ 4-0-32-5, రషీద్ 3-0-35-0, హర్ప్రీత్ 3-0-17-1.
పంజాబ్: రాహుల్ (సి) కార్తీక్ (బి) సకారియా 49, మయాంక్ (సి) లివింగ్స్టోన్ (బి) తెవాటియా 67, మార్క్మ్ (నాటౌట్) 26, పూరన్ (సి) శాంసన్ (బి) కార్తీక్ 32, హుడా (సి) శాంసన్ (బి) కార్తీక్ 0, అలెన్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 9, మొత్తం: 183/4. వికెట్ల పతనం: 1-120, 2-126, 3-183, 4-183, బౌలింగ్: ముస్తఫిజుర్ 4-0-30-0, సకారియా 3-0-31-1, కార్తీక్ 4-0-29-2, మోరిస్ 4-0-47-0, తెవాటియా 3-0-23-1, లోమ్రర్ 1-0-7-0, పరాగ్ 1-0-16-0.