కులవృత్తులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నడు
రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంటలో నాయీ బ్రాహ్మణ, రజక సంఘ నాయకులతో సమావేశం
జమ్మికుంట, జూన్22: రజకులు, నాయీ బ్రాహ్మణులు సమాజ సేవకులని, వారికి సేవ చేస్తే దేవుడికి సేవ చేసినట్లేనని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అభివర్ణించారు. మంగళవారం జమ్మికుంట పట్టణంలోని సువర్ణ ఫంక్షన్ హాల్లో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు ఆధ్వర్యంలో రజక సంఘం, నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు, సభ్యులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడారు. సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నారని, రజక, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్కు 500 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి అందజేస్తామని, స్థలం ఉన్న వారి కోసం ఇండ్లు కట్టుకునేందుకు నగదును అందజేస్తామని, పింఛన్లు, రేషన్ కార్డులు నెల రోజుల్లో అందుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ అనుక్షణం పేదల సంక్షేమం కోసమే ఆలోచిస్తూ ఉంటారని, అభివృద్ధి వైపే ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, తాము కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని సంఘం నాయకులు, సభ్యులు హామీ ఇచ్చారు.
ఈటల స్వార్థపరుడు
మాజీ మంత్రి ఈటల స్వార్థపరుడు అని, రాజకీయంగా అన్ని పదవులు అనుభవించి దురాలోచనతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని మంత్రి కొప్పుల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలను పార్టీ నుంచి ఎవరూ వెళ్లగొట్టలేదని, రాజకీయంగా అన్ని అవకాశాలు పొంది తన స్వార్థ ప్రయోజనాలకు కోసం మతతత్వ పార్టీ బీజేపీలో చేరాడని దుయ్యబట్టారు. పార్టీ టికెట్, కారు గుర్తుతోనే గెలిచారని, తన సొంత డబ్బులు పెట్టుకునేం అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ఆ పార్టీ డౌన్ఫాల్ స్టార్ట్ అయ్యిందని పేర్కొన్నారు. మతం పేరుతో రెచ్చగొట్టే పార్టీకి ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అనుక్షణం పేదల సంక్షేమం కోసమే సీఎం ఆలోచిస్తూ ఉంటారని, అభివృద్ధి వైపే ఉండాలని పిలుపునిచ్చారు. ఇంటి పార్టీ టీఆర్ఎస్నే గెలిపించుకోవాలని, తన ప్రాణాలకు ప ణంగా పెట్టిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య కోరారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ రాజేశ్వర్రావు, రజక, నాయీబ్రహ్మణ సంఘం నా యకులు శంకర్, రమేశ్, రాజు, రాకేశ్, రాము పాల్గొన్నారు.