ముంబై: ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కరోనాపై పోరులో భాగంగా తన వంతు సాయం చేసింది. భారత ప్రభుత్వానికి మిలియన్ డాలర్లు (రూ.7.5 కోట్లు) విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఆటగాళ్లతోపాటు టీమ్ యజమానులు, టీమ్ మేనేజ్మెంట్ ముందుకు వచ్చి విరాళాలు సేకరించారు. రాజస్థాన్ రాయల్స్కు చెందిన రాయల్ రాజస్థాన్ ఫౌండేషన్ (ఆర్ఆర్ఎఫ్), బ్రిటిష్ ఏషియన్ ట్రస్ట్ (బీఏటీ)తో కలిసి పని చేశారు అని టీమ్ వెల్లడించింది.
ఇప్పటికే బీఏటీ భారత ప్రభుత్వంతో కలిసి పని చేస్తోంది. ముఖ్యంగా ఆ ట్రస్ట్ ఫౌండర్ ప్రిన్స్ చార్లెస్.. ఆక్సిజన్ ఫర్ ఇండియా ఎమర్జెన్సీ అప్పీల్ చేశారు అని రాజస్థాన్ రాయల్స్ టీమ్ తెలిపింది. రాయల్స్ టీమ్ ఇచ్చిన విరాళం మొత్తం దేశంలో సహాయ కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు చెప్పింది.