బోధన్ ప్రభుత్వదవాఖానలో విజయవంతంగా నిత్యాన్నదానం
రోగులు, వారి సహాయకుల ఆకలి తీర్చుతున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంకల్పం
కరోనా లాక్డౌన్లోనూ దిగ్విజయంగా సేవలు
బోధన్, ఏప్రిల్ 25: ఒక రోజో, రెండు రోజులో కాదు… బోధన్ ప్రభుత్వ దవాఖానలో రోగులు, వారి బంధువులు, సహాయకులకు నిరంతరాయంగా జరుగుతున్న అన్నదానం ఆదివారం నాలుగో యే ట అడుగిడింది. దవాఖానకు వచ్చే రోగుల బంధువులు, సహాయకులు ఆకలి తీర్చుకోవడం కోసం పడే పాట్లను గమనించిన ఎమ్మెల్సీ, జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మూడేండ్ల క్రితం ఈ మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కవిత సంకల్పం ఫలితంగా… ప్రస్తుతం బోధన్ ప్రభుత్వ దవాఖానతోపాటు నిజామాబా ద్ జనరల్ దవాఖానలోనూ ఈ భోజన వితరణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. దీంతో ఈ దవాఖానలకు వచ్చే రోగులు, వారి సహాయకులు ఆకలిని తీర్చుకుంటూ… అన్నదాత కవితమ్మ సుఖీభవ… అంటూ దీవిస్తున్నారు. 2018 ఏప్రిల్లో ప్రారంభమైన ఈ నిత్యాన్నదాన కార్యక్రమం మూడేండ్లు పూర్తిచేసుకొని నాలుగో ఏడాదిలోకి అడుగుపెడుతుండడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
లాక్డౌన్లోనూ కొనసాగిన అన్నదానం
2018 ఏప్రిల్ 24న ఈ ఉచిత భోజన వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ కవిత మామ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్.రామ్కిషన్రావు ప్రారంభించారు. 1096 రోజులుగా ఈ అన్నదాన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతున్నది. 2020 కరోనా లాక్డౌన్ కాలంలోనూ, ప్రస్తుతం కొనసాగుతున్న కరోనా సంక్షోభం సమయంలోనూ కవిత తలపెట్టిన అన్నదాన కార్యక్రమం ఆగలేదు. రోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సుమారు రెండు గంటలపాటు అన్నదానం చేస్తున్నారు. భోజనం లో అన్నం, సాంబార్, కూరగాయలు, మజ్జిగ ఇస్తున్నారు. వారంలో నాలుగు రోజులపాటు అదనంగా క్యారెట్ హల్వా, పులిహోర, మినప వడ తదితర వంటకాలు ఉంటున్నాయి. ముఖ్యంగా వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ దవాఖానకు వచ్చే గర్భిణులకు సైతం ఈ భోజనం ఎంతో ఉపయోగపడుతున్నది. గతేడాది లాక్డౌన్ కన్నా ముందు రోజూ 400 నుంచి 500 మంది భోజనం చేసేవారు. ప్రస్తుతం 75 నుంచి 100 మంది వరకు భోజనం చేస్తున్నారు.
కిచెన్ షెడ్ ఏర్పాటు
నిజామాబాద్లో ఇటీవల ఏర్పాటు చేసిన కిచెన్ షెడ్తో ఈ దవాఖానకు రుచికరమైన ఆహారం సకాలంలో అందుతున్నది. ఈ కిచె న్ షెడ్ను కల్వకుంట్ల కవిత సొంత ఖర్చుతో ఏర్పాటు చేశారు. ఇక్కడ వంటలు వండి నిజామాబాద్ జనరల్ దవాఖానతోపాటు బోధన్ దవాఖానకు సరఫరా చేస్తున్నారు. ఈ కిచెన్ షెడ్లో వంటల తయారీ, సరఫరాను కలెక్టర్ పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు.