సౌథాంప్టన్: ఇండియా, న్యూజిలాండ్ మధ్య కాసేపట్లో వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్ ప్రారంభం కాబోతోంది. ఈ చారిత్రక మ్యాచ్ కోసం సౌథాంప్టన్లోని ఎజియస్ బౌల్ స్టేడియం సిద్ధమైంది. నాలుగేళ్ల కిందట చాంపియన్స్ ట్రోఫీలో ఓడిన రోజే ఇప్పుడు టీమిండియా మరో ఐసీసీ టోర్నీ ఫైనల్లో తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉండటమే ఆందోళన కలిగిస్తోంది. మ్యాచ్ జరిగే ఐదు రోజులూ సౌథాంప్టన్లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది.
అక్యువెదర్ అనే వాతావరణ వెబ్సైట్ ప్రకారం తొలి రోజు వర్షం పడే అవకాశం 65 శాతం ఉంది. రెండో రోజు 60 శాతం, మూడో రోజు 56 శాతం, నాలుగో రోజు 65 శాతం, ఐదో రోజు 63 శాతం వర్షం పడే అవకాశం ఉందన్న అంచనాలు మ్యాచ్ ఫలితంపై సందేహాలు వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి. మ్యాచ్ కోసం ఆరో రోజును రిజర్వ్ డేగా ఉంచిన విషయం తెలిసిందే. ఆ రోజు మాత్రం కేవలం 25 శాతం మాత్రమే వర్షం పడే చాన్స్ ఉంది.