ముంబై: ఇండియన్ టీమ్ కెప్టెనే కాదు.. హెడ్ కోచ్ పదవి కూడా అత్యంత విలువైనదే. ప్రతిసారీ ఓ కోచ్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న చర్చ జరుగుతూనే ఉంటుంది. చాలా కాలం పాటు మన బీసీసీఐ విదేశీ కోచ్లనే నమ్ముకున్నా.. ఆ తర్వాత మెల్లగా పరిస్థితిలో మార్పు వచ్చింది. మొదట కుంబ్లే, తర్వాత రవిశాస్త్రి హెడ్కోచ్లుగా ఉన్న సమయంలోనూ టీమిండియా అద్భుతమైన విజయాలు సాధించింది. ప్రస్తుతం రవిశాస్త్రి హెడ్కోచ్ అయిన తర్వాత రెండుసార్లు ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే ఓడించింది ఇండియన్ టీమ్. డబ్ల్యూటీసీ ఫైనల్కు కూడా చేరింది. అయితే అతని పదవీకాలం ఈ ఏడాది చివర్లో జరగనున్న టీ20 వరల్డ్కప్తో ముగియనుంది.
దీంతో అతని తర్వాత ఎవరు అన్న చర్చ ఇప్పుడే ప్రారంభమైంది. ఈ రేసులో మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ అందరి కంటే ముందు ఉంటాడని టీమిండియా మాజీ ఆల్రౌండర్ రితేందర్ సింగ్ సోధి చెప్పాడు. ఇప్పటికే ద్రవిడ్ను శ్రీలంక వెళ్లిన మరో టీమ్కు కోచ్గా నియమించిన విషయం తెలిసిందే. పైగా నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్గా, అండర్-19 టీమ్ కోచ్గా ద్రవిడ్ మంచి సక్సెస్ సాధించాడు. అతన్ని కోచ్ను చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ కూడా ఉంది.
ఈ నేపథ్యంలో శ్రీలంక టూర్కు ద్రవిడ్ను కోచ్ను చేసి బీసీసీఐ జరగబోయేది ఏంటన్నదానిపై ఓ హింట్ ఇచ్చిందని సోధి అన్నాడు. రవిశాస్త్రి కోచ్గా మంచి విజయం సాధించాడు. అయితే అతని కాంట్రాక్ట్ ముగియబోతోంది. ఇప్పుడు ద్రవిడ్ను శ్రీలంకకు హెడ్కోచ్గా పంపించారంటే అతడు తర్వాతి హెడ్ కోచ్ రేసులో ఉన్నట్లేనని బోర్డు స్పష్టంగా చెప్పినట్లే. నిజానికి రవిశాస్త్రి స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉన్నది రాహుల్ ద్రవిడ్కే అని సోధీ స్పష్టం చేశాడు.