నగరంలో హైరిస్క్ గ్రూప్ వారికి మూడు కేంద్రాలు ఏర్పాటు
కొవిన్ యాప్లో వివరాలు నమోదు చేస్తున్న బల్దియా సిబ్బంది
కార్పొరేషన్, జూన్ 6: నగరపాలక సంస్థ పరిధిలో హైరిస్క్ గ్రూప్ పరిధిలోని 10 వర్గాల ప్రజలకు కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతున్నది. సమాజంలో నిత్యవసరాల విభాగాల్లో పని చేసే వారు, ప్రతి రోజూ వందలాది మందితో సంబంధం ఉండే వారిని గుర్తించి వ్యాక్సిన్ వేయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బల్దియా ఐదు రోజుల క్రితమే ప్రణాళికలు తయారు చేసి చర్యలు ప్రారంభించింది. హైరిస్క్ గ్రూప్ పరిధిలోకి వచ్చే వారు వ్యాక్సిన్ కోసం కొవిన్ యాప్లో వివరాలు నమోదు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతారనే ఉద్దేశంతో అధికారులు నగరపాలక సంస్థ సిబ్బందికి ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించి నమోదు కార్యక్రమం చేపట్టారు. కాగా, శుక్రవారం నుంచి నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల, బాలాజీ ఫంక్షన్ హాల్, వైశ్య భవన్లో హైరిస్క్ గ్రూప్ వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. పది రోజుల్లో ఈ వర్గాల వారికి వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నారు.
ఇంటింటికీ తిరిగి వివరాలు నమోదు
నగరంలోని రైతుబజార్, కూరగాయల మార్కెట్, మటన్, చికెన్, చేపల విక్రయదారులు, కిరాణా దుకాణాల యజమానులు, కార్మికులు, మద్యం దుకాణాలు, వీధి వ్యాపారులు, క్షౌరశాలలు, లాండ్రీ, చిన్న హోటళ్ల యజమానులు, కార్మికులకు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కొవిన్ యాప్లో వివరాలు నమోదు చేసేందుకు 60 డివిజన్లకు నగరపాలక సంస్థ శానిటేషన్, రెవెన్యూ విభాగానికి చెందిన సిబ్బందిని బృందాలుగా ఏర్పాటు చేశారు. ప్రతి రోజూ కనీసం 50 మంది వివరాలు కొవిన్ యాప్లో నమోదు చేసి, వ్యాక్సిన్ వేసే తేది, సెంటర్, సమయంతో కూడిన సమాచారం వారి ఫోన్ నంబర్కు మెస్సేజ్ వచ్చేలా చూడాలని ఆదేశించారు. దీంతో ఐదు రోజులుగా నగరపాలక సంస్థ అధికారులు వ్యాపారాలు చేసుకుంటున్న వారికి వద్దకు వెళ్లి వివరాలు కొవిన్ యాప్లో నమోదు చేయిస్తున్నారు. ఈ బృందాలు డివిజన్లలో ఉదయం 7 గంటల నుంచే సర్వే చేపడుతున్నాయి. వ్యాపారాలు నిర్వహించుకునే వారితో పాటు 18 ఏళ్లు నిండిన కుటుంబ సభ్యులకు కూడా వ్యాక్సిన్ వేసే దిశగా చర్యలు చేపడుతున్నారు.
మూడు కేంద్రాల్లో వ్యాక్సినేషన్
నగరంలోని హైరిస్క్ గ్రూప్ల వారికి మూడు కేంద్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా సాగుతున్నది. కొవిన్ యాప్లో వివరాలు నమోదు చేసిన వారికి వ్యాక్సిన్ కేంద్రం, తేదీ, సమయం ఫోన్కు మెస్సేజ్ వస్తుండడంతో ఆయా సమయానికి సంబంధిత కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాగే, మేయర్ వై సునీల్రావుతో పాటు కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్, అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని హైరిస్క్ గ్రూప్ వారు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు.