హైదరాబాద్ : గ్రామాలు, పట్టణాల్లో కొవిడ్ బారిన పడుతున్న ప్రజల కోసం ప్రభుత్వ స్కూల్స్, సంస్థల భవనాలను ఐసోలేషన్ కేంద్రాలుగా వినియోగంలోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో మాట్లాడినట్లు వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా వినోద్కుమార్ స్పందిస్తూ.. కరోనా సోకితే ఇంట్లో ఐసోలేషన్ కోసం తగినంత వసతి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఇలాంటి వారి కోసం ప్రత్యేకంగా ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకోసం గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలను, కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను, సిరిసిల్ల, వేములవాడలో పీటీసీ ని ఐసోలేషన్ కోసం అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లకు సూచించినట్లు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు.