టోక్యో: ఒలింపిక్స్లో పతకం దిశగా మరో అడుగు వేసింది బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ( PV Sindhu ). శుక్రవారం జరిగిన క్వార్టర్ఫైనల్ మ్యాచ్లో జపాన్కు చెందిన యమగుచిపై 21-13, 22-20 తేడాతో గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది. అయితే ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి గేమ్లో తొలుత వెనుకబడినా.. అద్భుతంగా పుంజుకున్న సింధు 21-13తో గెలుచుకుంది. రెండో గేమ్లోనూ అదే దూకుడు ప్రదర్శించింది. ఒక దశలో 15-9 ఆధిక్యంలోకి దూసుకెళ్లి.. ఈజీగా మ్యాచ్ గెలిచేలా కనిపించింది. కానీ జపాన్ ప్లేయర్ యమగుచి అనూహ్యంగా పుంజుకోవడంతోపాటు సింధు పదే పదే అనవసర తప్పిదాలు చేసింది. దీంతో యమగుచి ఒక దశలో 20-18 ఆధిక్యంలోకి వెళ్లి గేమ్ గెలిచేలా కనిపించింది. ఈ సమయంలో సింధు వరుసగా నాలుగు పాయింట్లు సాధించి మ్యాచ్ను సొంతం చేసుకుంది.
ఇద్దరు ప్లేయర్స్ హోరాహోరీగా తలపడటంతో మ్యాచ్లో ఎన్నో సుదీర్ఘ ర్యాలీలు అలరించాయి. ముఖ్యంగా రెండో గేమ్లో ఒక్కో పాయింట్ కోసం ఇద్దరు ప్లేయర్స్ విపరీతంగా శ్రమించారు. కళ్లు చెదిరే స్మాష్, డ్రాప్ షాట్లతో ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ప్రయత్నించారు. అయితే ఒత్తిడిలోనూ గేమ్ పాయింట్ను కాచుకొని మరీ వరుసగా నాలుగు పాయింట్లు సాధించిన సింధు.. మ్యాచ్ మరో గేమ్కు వెళ్లకుండా 21-13, 22-20తో వరుస గేమ్స్లోనే ముగించేసింది. సెమీస్లో సింధు గెలిస్తే కనీసం సిల్వర్ మెడల్ ఖాయమవుతుంది.